ముందు పంచాయతీలలో కధ తేల్చుకోవడానికే తమ్ముళ్ళు అష్టకష్టాలు పడుతున్నారు. చాలా చోట్ల అభ్యర్ధులు లేరు. ఉన్న వారు పోటీకి రారు. ఇదీ పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీలో కనిపిస్తున్న సీన్.
సర్పంచ్ పదవికి పోటీ చేస్తే ఏమొస్తుంది. జబ్బలు చరిచి నిలిచినా ఒరిగేది ఏముంది. ఇదీ తమ్ముళ్ల వైరాగ్యం. ఎటూ అధికారంలో వైసీపీ ఉంది. ఆనక అటు వైపే చూడాలి. ఈ మాత్రం భాగ్యానికి బస్తీ మే సవాల్ ఎందుకు అన్న ముందు చూపుతో తమ్ముళ్ళు చాలా మంది పోటీకి నై అనేస్తున్నారు.
కానీ పైన ఉన్న చంద్రబాబు, విశాఖ సిటీలో ఉన్న బడా తమ్ముళ్ళకు మాత్రం పంచాయతీ ఎన్నికలలో పరమాద్భుతాలు జరిగిపోతాయన్న భ్రాంతి గట్టిగానే ఉంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే మొత్తం సర్పంచులు గెలవాల్సిందే అంటున్నారు.
ఇవన్నీ సరిగమలు అనుకుంటే మరి కొందరు పార్టీ పెద్దలు తమదైన శైలిలో పదనిసలు కూడా వినిపిస్తున్నారు. ఇంకా జరగని జీవీఎంసీ ఎన్నికలకు ముందు తెచ్చి విశాఖ మేయర్ పీఠం కచ్చితంగా టీడీపీదేనని ఢంకా భజాయిస్తున్నారు.
ఇపుడు జరిగేది పంచాయతీ తంతు. ముందు అక్కడ నెగ్గాలి సామీ. ఎందుకొచ్చిన మేయర్ గోల అంటూ సొంత పార్టీలోనే ఈ తరహా నేతల మీద సెటైర్లు పడిపోతున్నాయి. ఇంతకీ సర్పంచ్ ఎన్నికలు తమ్ముళ్ళకు నిండా సంతోషాన్ని ఇస్తాయా..ఆ ఒక్కటీ అడగకూడదేమో.