మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ కుటుంబానికి చెందిన డెయిరీని మూసేశారని తెలిసింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల తనయుడు జగత్ పేరుతో డెయిరీని 2012-13 మధ్య కాలంలో నెలకొల్పారు.
భూమా నాగిరెడ్డి దంపతులు జీవించినంత కాలం డెయిరీకి సంబంధించి పాల వ్యాపారం సాఫీగా సాగిపోయేది. జగత్ డెయిరీ వ్యవహారాలను అఖిలప్రియ పెదనాన్న కుమారుడు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చూసుకునేవారు.
భూమా నాగిరెడ్డి మరణానంతరం నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి గెలుపొందడం, రాజకీయాల్లో బిజీ కావడంతో డెయిరీని సీనియస్గా పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో వ్యాపారం కూడా ఆశాజనంగా లేనట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి ఓటమిపాలయ్యారు. దీంతో డెయిరీని పట్టించుకోవడం బాగా తగ్గించారనే సమాచారం.
ఈ నేపథ్యంలో ఏడాదిగా డెయిరీకి సంబంధించి విద్యుత్ బిల్లులను అసలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలనెలా బిల్లు పెరిగిపోయి … ప్రస్తుతం దాదాపు రూ.కోటి చొప్పున విద్యుత్ బకాయిపడినట్టు తెలుస్తోంది. ప్రతి నెలా రూ.10 లక్షలు చెల్లిస్తామని విద్యుత్ శాఖకు సర్ది చెప్పుకుని ఇండస్ట్రీని నడుపుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఆ మాటను కూడా నిలబెట్టుకోలేక పోయారని తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం విద్యుత్శాఖ అధికారులు జగత్ డెయిరీకి విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో జగత్ డెయిరీని ఏకంగా మూసేశారని సమాచారం.
సామాన్యులు ఒక నెల బిల్లు చెల్లించకపోతే, యుద్ధ ప్రాతిపదికన కరెంట్ సరఫరా నిలిపివేసే అధికారులు … ఒక రాజకీయ నేత తన పారిశ్రామిక సంస్థకు సంబంధించి నెలల తరబడి బిల్లులు చెల్లించకపోయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకో న్యాయం, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు మరో న్యాయమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లపై బ్యాంకులో రుణాన్ని తీసుకొచ్చి జగత్ డెయిరీని స్థాపించడం, దాన్ని నడపడం తెలిసిందే. తాజాగా డెయిరీ మూసివేతతో తమ గతి ఏంటని రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నాయకులు, బ్యాంకు అధికారులు, విద్యుత్, తదితర అధికారులు లోపాయికారి ఒప్పందాలు చేసుకుని తమను నిండా ముంచారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.