గత కొన్ని నెలలుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టీవ్ కానున్నారు. గతంలో చంద్రబాబు, లోకేశ్లపై ఒంటికాలిపై లేచే విజయసాయిరెడ్డి ఒక్కసారిగా మౌనాన్ని ఆశ్రయించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వైసీపీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని, ఆయన్ను సీఎం జగన్ దూరం పెట్టారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఆ మధ్య నందమూరి కుటుంబంలోని తన సమీప బంధువు చనిపోయిన సందర్భంలో చంద్రబాబు, బాలకృష్ణలతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా మెలగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అలాగే చంద్రబాబునాయుడి పుట్టిన రోజు సందర్భంగా చాలా గౌరవంగా శుభాకాంక్షలు చెప్పడం కూడా చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టీవ్ కానున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎప్పుడ నేది మాత్రం తెలియలేదు. విజయసాయిరెడ్డి వైసీపీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించడానికి ఈ నెల 5న బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది. గతంలో విజయసాయిరెడ్డి కేంద్ర కార్యాలయంలో వుంటూ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేవారు.
అయితే కొన్ని నెలలుగా మౌనాన్ని ఆశ్రయించడంతో ఆయనపై రకరకాల ప్రచారం జరిగింది. ఒక దశలో టీడీపీలో విజయసాయి రెడ్డి చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఇటీవల విజయసాయిరెడ్డిని సీఎం జగన్ పిలిపించుకుని గతంలో మాదిరిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డి అవసరం పార్టీకి ఎంతో అవసరం ఉందని జగన్ గుర్తించారు.
దీంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ముఖ్యంగా గత ఐదేళ్లుగా పార్టీ పదవులు ఎవరికీ ఇవ్వలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయమై విజయసాయిరెడ్డి కసరత్తు ప్రారంభించనున్నారు. విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టీవ్ అవుతుండడంతో ఆయన వర్గీయులు ఖుషీ అవుతున్నారు.