ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజాన్ని నెలకొల్పేందుకు ఆయన ముందడుగు వేశారు.
ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ పెట్టారు. ప్రతి చిన్న విషయానికి మండల, జిల్లా అధికారుల వద్దకు వెళ్లే ఇబ్బందులను తొలగించేందుకు జగన్ దూరదృష్టితో చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది.
జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను కల్పించారు. అంతేకాదు, ఇంతకు మూడింతల మంది వార్డు వాలంటీర్లను కూడా జగన్ సర్కార్ ప్రజాసేవకు రిక్రూట్ చేసింది.
గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది కొత్తగా ప్రవేశ పెట్టడంతో చాలా చోట్ల అద్దె ఇళ్లలో కొనసాగించాల్సిన పరిస్థితి. పట్టణ, నగరాల్లో కనీస సౌకర్యాలు తీర్చుకునేందుకు బాత్రూం ఏర్పాట్లు ఉన్నాయి. కానీ గ్రామాల్లో చాలా చోట్ల అలాంటి సౌకర్యాలు కొరవడడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నలుగురైదుగురు మహిళా ఉద్యోగినులు ఉన్నారు. వీరంతా కూడా 25-30 ఏళ్ల లోపు యువతులు. కనీస సౌకర్యాలు తీర్చుకునే వసతులు లేకపోవడంతో మహిళా ఉద్యోగినులు మానసికంగా తీవ్ర అవేదన చెందుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో గొప్ప ఆలోచనతో ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థలో అందుకు తగ్గట్టు చాలాచోట్ల సౌకర్యాలు కల్పించాలన్న స్పృహ ఉన్నతాధికారుల్లో కొరవడింది. అందువల్లే తాము కుంగుబాటుకు గురి కావాల్సి వస్తోందని మహిళా ఉద్యోగినులు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాష్ట్రంలో మహిళలకు చిన్న హాని కలిగినా వెంటనే అక్కడ వాలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి ఆమె ఎంతో చొరవ చూపుతున్నారు. అయితే సచివాలయాల్లో ఉద్యోగినుల సమస్యలు ఆమె దృష్టికి వెళ్లినట్టు లేదు. అలాగే ఉద్యోగ సంఘాలు ఉద్యోగినుల కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి.
ఇప్పటికైనా సచివాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించి ఉద్యోగినులకు మానసిక వేదన నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై మహిళా కమిషన్ చైర్పర్సన్ తక్షణం స్పందించి, మన సచివాలయ బిడ్డలకు మానసిక వేదన నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తారని ఆశిద్దాం.