హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్కుమార్ రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అసలు విచారణతో సంబంధం లేని అప్రస్తుత, అసందర్భ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం భావిస్తున్నట్టు …అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్రెడ్డి తెలిపారు.
‘మిషన్ బిల్డ్ ఏపీ’ వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ రాకేశ్కుమార్ తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై ఆయనే విచారించడం గమనార్హం. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ రాకేశ్కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలపై కూడా ఆయన కామెంట్స్ చేశారు.
‘తప్పుడు వివరాలతో ఐఏఎస్ అధికారి ప్రవీణ్కుమార్ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో జత చేసిన దస్త్రాల్లో కానీ, కోర్డు డాకెట్ షీట్లో కానీ ఆ ఆరోపణలు బలపర్చేట్లు ఆధారాలు లేవని స్పష్టమైంది. అలాంటి అఫిడవిట్ను అబద్ధపు నేరం కింద పరిగణించాల్సి ఉంటుంది.
అలాంటి అఫిడవిట్ను దాఖలు చేసిన ప్రవీణ్కుమార్ చర్యలపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో ఆరువారాల్లో సంజాయిషీ ఇవ్వండి. ఇది కోర్టు విధుల్లో జోక్యం చేసుకోవడమే. న్యాయస్థానాన్ని చులకన చేయడంగానే భావించాల్సి ఉంటుంది’ అంటూ జస్టిస్ రాకేశ్కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ప్రవీణ్కుమార్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిపేందుకు సంబంధిత జ్యుడీషియల్ చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ జనరల్ను ఆయన ఆదేశించడం గమనార్హం. భవిష్యత్లో ఇలాంటి పిటిషన్లు వేయడానికి ఎవరూ సాహసించకూడదని పేర్కొన్నారు. జస్టిస్ రాకేశ్కుమార్ తీర్పులో పేర్కొన్న అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
‘సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ద్వారా అనుచిత లబ్ధి పొందడంలో ముఖ్యమంత్రి జగన్ విజయవంతమయ్యారు.
ఆ లేఖ వల్ల ఏపీ సీఎం అంతిమంగా ఊరట పొందుతారో లేదో తెలీదు గానీ.. దాని వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ జరిగిందని ప్రజలు భావించే అవకాశముంది. ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీల్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ అలాంటి నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు కొలీజియంలోని సభ్యుల మాదిరిగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారే’ అని జస్టిస్ రాకేశ్కుమార్ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలపై జస్టిస్ రాకేశ్కుమార్ కామెంట్స్పై అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఘాటుగా స్పందించారు. జడ్జి తీర్పులో పేర్కొన్న అంశాలు ఈ కేసుకు సంబంధం లేనివని, బహుశా వ్యక్తిగత దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా ఆయన నిన్న రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జస్టిస్ రాకేశ్కుమార్ వ్యాఖ్యలు హైకోర్టు స్థాయిని, హైకోర్టు న్యాయమూర్తుల స్థాయిని, న్యాయ వ్యవస్థ స్థాయిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయిని తగ్గించేలా ఉన్నాయని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలను సవాల్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా ఆందోళనకరమని ఆయన తెలిపారు.
ఐఏఎస్ అధికారి ప్రవీణ్కుమార్ హైకోర్టులో తప్పుడు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేశారని, అది న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉందంటూ, ఏకంగా కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదని నోటీసులిచ్చిన జస్టిస్ రాకేశ్కుమార్, తన వ్యాఖ్యలు మాత్రం న్యాయస్థానం గౌరవాన్ని పెంచుతాయని ఎలా అనుకున్నారో అనేది పొన్నవోలు ప్రశ్న.
ఇదే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఏది ఏమైనా జస్టిస్ రాకేశ్కుమార్ తన రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు ఇచ్చిన తీర్పు తీవ్ర సంచలనం రేకెత్తించిదనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చేస్తామని జస్టిస్ రాకేశ్కుమార్ సుమోటోగా విచారణ చేపట్టడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర విచారణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ రాకేశ్కుమార్ తీర్పుపై సుప్రీంకు వెళుతుండడం సహజంగానే ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క