తాడిపత్రి వివాదంపై జగన్ సర్కార్ ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణకు సంబంధించి ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయిప్రతాప్పైనా హత్యయత్నం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే సహా మొత్తం 15 మందిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
కాగా తన ఇంటి వద్దకు పెద్దారెడ్డి తన మందీమార్బలంతో వెళ్లి అనుచరుడిని కొట్టినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు చేయనని జేసీ ప్రభాకర్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జేసీ ప్రభాకర్రెడ్డి లాయర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా ఆయన కుమారులు, అనుచరులపై వివిధ రకాల కేసులు నమోదు చేసినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాకు తెలిపారు.
అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని జేసీ తరపు లాయర్ ప్రకటించడం గమనార్హం. ఓ అర్జీ, సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చానని ఆయన తెలిపారు.
తనను ఫిర్యాదు దారుడిగా పరిగణించొద్దని పోలీసులకు జేసీ తరపు లాయర్ విజ్ఞప్తి చేయడం ఈ కేసులో ట్విస్ట్గా చెప్పుకోవచ్చు. ఇదే ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి సహా 27 మందిపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు.