జమిలి ఎన్నికలొస్తున్నాయి కాచుకోండి.. అంటూ కార్యకర్తలకు ప్రతి రోజూ ఉపదేశాలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు చంద్రబాబుకి ఈ ముందస్తు ఎన్నికల పిచ్చి ఏంటని అందరూ అదో రకంగా చూస్తున్నారు.
దీంతో.. కనీసం పార్టీ శ్రేణుల్ని అయినా వీలైనంతగా భ్రమల్లోకి నెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు.
పప్పు బెల్లాల్లో పదవుల పంపకం..
జిల్లా అధ్యక్షులు అనే పదవుల్ని పక్కనపెట్టి, పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల్ని నియమించిన చంద్రబాబు.. మహిళా విభాగం అధ్యక్షులు, రైతు విభాగం అధ్యక్షులు అంటూ పదవుల్ని పప్పు బెల్లాల్లా పంచారు.
అధికారంలో లేనప్పుడు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం బాబుకి బాగా అలవాటే. అందులో భాగంగానే ఈ జిమ్మిక్కులన్నీ చేశారు. పార్టీకి ఉపాధ్యక్షులు, కార్యదర్శుల పోస్ట్ లు లెక్కలేనన్ని సృష్టించారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
ట్రబుల్ షూటర్ల నియామకం..
తాజాగా టీడీపీ రాష్ట్రంలో ఐదుగురు ట్రబుల్ షూటర్లని నియమించింది. 25 నియోజకవర్గాలను ఐదుగా విభజించి.. వీరికి పంచి పెట్టారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, క్షేత్ర స్థాయిలో విభేదాలు, సమస్యలు పరిష్కరించడం కోసం వీరిని నియమిస్తున్నట్టు చెప్పినా.. కేవలం హడావిడి చేస్తూ, అసంతృప్తుల్ని బుజ్జగించడం కోసమే బాబు ఈ పని చేసినట్టు అర్థమవుతోంది. ప్రధాన కార్యదర్శులకే ఈ ట్రబుల్ షూటర్ల పదవులు అప్పగించారు.
రాజకీయ బాధ్యత దేవినేనికి..
ఒంటరి పోరాటం ఎంత దారుణమైన ఫలితాలను ఇస్తుందో 2019లో చంద్రబాబుకి రూఢీ అయింది. అందుకే జమిలి జపం చేస్తున్నా.. ఇప్పటినుంచే భావసారూప్య పార్టీలతో పొత్తు అంటూ కలవరిస్తున్నారు. పొత్తుల కోసం ఏకంగా ఓ పోస్టునే క్రియేట్ చేశారు బాబు. ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతల్ని దేవినేని ఉమాకు అప్పగించారు.
మొత్తమ్మీద టీడీపీలో మళ్లీ హడావిడి మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో పదవుల్ని ఇవ్వడానికి చంద్రబాబు బాగా ఆలోచించేవారు. నాలుగేళ్లు కాలం గడిపి, ఎన్నికల ఏడాదిలో చాలామందికి కార్పొరేషన్ పదవుల్ని పంచి పెట్టారు.
కనీసం సొంత మనుషులకి కూడా ఏమీ చేయలేని, చేయాలని అనుకోని నీఛ మనస్తత్వం బాబుది. అలాంటి బాబు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు పార్టీ పదవుల్ని ఎలా పంచి పెడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
అయితే చంద్రబాబు బాధ్యతలు ఇచ్చారు కదా అని చంకలు గుద్దుకునేవారు ఎవరూ టీడీపీలో లేరు. బయటకి వెళ్లలేక, టీడీపీలో ఉండలేక సతమతమవుతున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.