తిరుపతిలో ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా రాజకీయ కోణంలోనే చూస్తారు. ఎందుకంటే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటమి పాలై, బీజేపీ గెలుపొందడం రాజకీయ సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ చావు తప్పి కన్నులొట్టపోయిన సందంగా ….భారీగా నష్టపోయి అతిపెద్ద పార్టీగా అవతరించింది.
బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో కూడా విజయయాత్ర కొనసాగించాలని బీజేపీ తహతహలాడుతోంది.
ఇటీవల తిరుపతిలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, కేడర్ను ఉప ఎన్నికకు సమాయత్తం చేస్తోంది. అయితే అధికార వైసీపీ మాత్రం ఇంత వరకూ తన బలాన్ని ప్రదర్శించలేదు.
తాజాగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్నదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో సుమారు 20 వేల మందితో ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్రెడ్డి నేతృత్వంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆ జన ప్రవాహాన్ని చూస్తే అదిరె అదిరె ప్రత్యర్థుల గుండెలదిరె అన్నట్టు ఉంది. నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి తుడా కార్యాలయం వరకు సుమారు కిలో మీటర్ వరకు ఇసుకేస్తే రాలనంత మంది ర్యాలీ నిర్వహించారు. మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీలో పాల్గొని జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలంటూ నినాదాలతో హోరెత్తించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జగన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను చేతబూని ర్యాలీతో తిరుపతిని జన కడలిని తలపించారు. అనంతరం తుడా కార్యాలయం ఎదురుగా వైఎస్సార్ విగ్రహం వద్ద వంద కిలోల కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అలాగే రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు పండుగ దినమన్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా జగన్ పాలన సాగుతోందన్నారు. తిరుపతిలో ఉప్పెనలా వెల్లువెత్తిన జన తరంగాన్ని చూసి రానున్న ఉప ఎన్నికలో అసలు పోటీ చేసేందుకు కూడా ప్రత్యర్థులు భయపడేలా ఉందన్నారు.
ఉప ఎన్నికలో మరోసారి వైసీపీ సత్తా చాటుతుందనేందుకు జగన్ పుట్టిన రోజు వేడుకకు తరలి వచ్చిన అశేష జనవాహినే నిదర్శనమన్నారు.