సేవలన్నీ సొమ్ములున్న వాళ్లకు మాత్రమే?

దేశంలోనే నిస్సందేహంగా పేద ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాన రంగం రైల్వే. లక్షలాది మంది పేదలకు ఇది ఇప్పటికీ కూడా చవకైన ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. రైళ్లలో ప్రతినిత్యం ఎన్నికోట్ల మంది…

దేశంలోనే నిస్సందేహంగా పేద ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాన రంగం రైల్వే. లక్షలాది మంది పేదలకు ఇది ఇప్పటికీ కూడా చవకైన ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. రైళ్లలో ప్రతినిత్యం ఎన్నికోట్ల మంది ప్రయాణం చేస్తున్నారో, అందులో కనీసం యాభైశాతం మందికి పైగా రిజర్వేషన్లు దొరక్కపోవడం కారణంగా, సీట్లు లేకపోవడం మూలంగా తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఖరీదైన మార్గాలను ఎంచుకుంటున్నారు. 

అయితే ఆ కోణంలోంచి తమ సేవలను మెరుగుపరచుకోవాల్సిన రైల్వే, సంపన్నుల సేవలో మురిసిపోతుండడం, అక్కడికేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా డప్పు కొట్టుకుంటుండడం ఇక్కడ గమనార్హం.

కేంద్రం దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వందే భారత్ రైళ్లను చాలా ప్రతిష్ఠాత్మకమైనవిగా కేంద్రంలోని బిజెపి సర్కారు భావిస్తోంది. ఎంతగా అంటే.. ఈ వందేభారత్ రైళ్ల ప్రాజెక్టును మాత్రమే కాదు.. ఏ ఊర్లో కొత్త రైలును ప్రారొంభిస్తున్నా.. ప్రతి చోటకు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెళుతున్నారు. 

వందేభారత్ రైళ్లు అనేవి అత్యద్భుతం అని ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పేద ప్రజలైతే , వందేభారత్ రైళ్లలో ప్రయాణం చేయడాన్ని తమ స్తోమతకు మించిన పనిగా భావిస్తారో, ఏ పేదలైతే ఆ ప్రయాణాన్ని కేవలం కలగా కలిగి ఉంటారో అలాంటి పేదలతో చప్పట్లు కొట్టించుకోవాలని మోడీ ముచ్చటపడుతున్నారు. సంపన్నుల సేవలో తరించే ఈ రైళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

అయితే సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రారంభించిన వందేభారత్ రైల్లో 8 బోగీలు మాత్రమే తొలుత పెట్టారు. రద్దీ ఎక్కువైపోయిందిట.. ఆక్యుపెన్సీ రేషియో 120 నుంచి 130 శాతం నమోదు అవుతోందిట. అందుకని సంపన్నుల సేవార్థం ఆ బోగీల సంఖ్యను రెట్టింపు చేసి 16 బోగీలు ఏర్పాటు చేశారు. 

ఆక్యుపెన్సీ రేషియో అదనంగా నమోదు కావడం కేవలం వందేభారత్ కు మాత్రమే జరుగుతున్నదా? పేద ప్రజలకు స్లీపర్, జనరల్ బోగీలతో కూడా సేవలందించే మామూలు రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో అదనంగా ఉండడం లేదా? మరి స్లీపర్, జనరల్ బోగీల సంఖ్య పెంచడానికి రైల్వే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అలా చేస్తే పేదలు సుఖపడితపోతారని, గతిలేని నిరుపేదలకు ఎక్కువ సేవ చేసినట్లు అవుతుందని సంకోచిస్తున్నారా? అనే తరహా ప్రశ్నలు ప్రజలు సంధిస్తున్నారు.