ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఇవాళ ఆయనకు ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం విశేషం. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో శరత్చంద్రారెడ్డిని ఈడీ మూడు రోజుల పాటు విచారించింది. అనంతరం అదే ఏడాది నవంబర్ రెండో వారంలో మద్యం వ్యాపారి వినయ్బాబుతో పాటు శరత్చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
ఈ ఏడాది జనవరిలో నానమ్మ మృతి చెందడంతో శరత్ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. 14 రోజుల పాటు ఆయన బెయిల్పై బయట ఉన్నారు. తాజాగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు శరత్చంద్రారెడ్డి విన్నపంపై సానుకూలంగా స్పందించింది.
శరత్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో శరత్ ఊపిరిపీల్చుకున్నట్టైంది. ఇదే కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్రెడ్డి తనయుడు రాఘవరెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇంకెంత కాలం ఆయన జైల్లో ఉంటారో తెలియని పరిస్థితి.
మాగుంట శ్రీనివాస్రెడ్డిని కూడా ఇటీవల ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కె.కవితను కూడా ఈడీ పలు దఫాలు విచారించింది. కవితను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.