యువగళం పేరుతో కుప్పం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టి, ఇప్పటికి వెయ్యి కిలోమీటర్లు నడిచారు. అయితే లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి వచ్చిన రాజకీయ ప్రయోజనం ఏమీ లేదనే టాక్ వినిపిస్తోంది. అసలు ఆ పాదయాత్ర ఎక్కడ సాగుతున్నదో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అక్కడక్కడ మాత్రమే… అరె లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారే అనే చర్చ నడుస్తోంది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేల పుణ్యమా అని లోకేశ్ పాదయాత్రకు గుర్తింపు వస్తోంది.
పాదయాత్రను విజయవంతం చేసుకునేందుకు లోకేశ్ చిల్లర వేషాలు వేస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. పాదయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై లోకేశ్ మాట్లాడితే బాగుండేది. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. మీడియాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల అటెన్షన్ కోసం లోకేశ్ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలకు దిగుతున్నారు. లోకేశ్ ఏం మాట్లాడినా వైసీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే, అసలు ఆయన ఉనికే లేదని చెప్పొచ్చు.
చిత్తూరు జిల్లాలో లోకేశ్ను అక్కడి ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోలేదు. నడుస్తూ వెళ్లనివ్వాలని, నోటికొచ్చినట్టు మాట్లాడుకోని వ్వండి అని చిత్తూరు జిల్లా వైసీపీ పెద్దలు పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు అంత సీన్ లేదనే టాక్ వినిపించింది. చిత్తూరు నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. అనంతపురం వైసీపీ నేతలు లోకేశ్ విమర్శలపై సీరియస్గా రియాక్ట్ కావడంతో ఉద్రిక్తత నెలకుంది. ఉదాహరణకు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
చివరికి వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి కొట్టుకునే వరకూ దారి తీసింది. అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్ర అలా సాగిపోయిందనిపించారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలో ప్రవేశం. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తనపై లోకేశ్ విమర్శలకు తీవ్రంగా స్పందించారు. లోకేశ్ను బఫూన్తో పోల్చారు. తన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేదని, నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగుండదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా కర్నూలు ఎమ్మెల్యే హపీజ్ఖాన్ కూడా ఘాటుగా స్పందించారు. మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. తనపై ఆరోపణలు నిరూపించాలని, పాదయాత్రలో మీ వెంట నడుస్తానని లోకేశ్కు సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్టు మాట్లాడితే తనతో పాటు పాదయాత్ర చర్చనీయాంశం అవుతుందని లోకేశ్ ఛీప్ ట్రిక్స్కు పాల్పడుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. దీనివల్ల లోకేశ్ చిల్లర నాయకుడు కావడం తప్ప, ఒరిగేదేమీ ఉండదని అంటున్నారు.