ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. 2014లో ఆయన వైసీపీ తరపున ఖమ్మం లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన అప్పటి టీఆర్ఎస్ పంచన చేరారు. 2019లో ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ అదే పార్టీలో కొనసాగారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పొంగులేటికి ఏ పదవీ లేకపోవడంతో పిచ్చెక్కినట్టుగా వుందని ఆయన అభిమానులు అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ దూసుకెళుతోంది. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన నాయకుడైన పొంగులేటిపై బీజేపీ దృష్టి సారించింది. కొంత కాలంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. తనకంటూ వర్గాన్ని కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు.
ఇవాళ పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావును బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నేతృత్వంలోని ఆ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. పొంగులేటి నివాసంలో లంచ్ మీటింగ్ జరిగింది. బీజేపీలో చేరాలని వారిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. పొంగులేటి, జూపల్లి ముఖ్య అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు అమిత్షా, నడ్డాతో చర్చిస్తామని ఈటల హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఐక్యంగా పని చేస్తే ఈ దఫాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వారితో ఈటల అన్నట్టు తెలిసింది. అయితే తమ అనుచరులతో చర్చించి పార్టీలో చేరికపై సమాచారం ఇస్తామని ఈటలతో ఆ ఇద్దరు నేతలు అన్నట్టు తెలిసింది.
ఇదిలా వుండగా వైఎస్ షర్మిల పార్టీలో పొంగులేటి చేరుతారని విస్తృత ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని షర్మిల కూడా ఒక సందర్భంలో ప్రకటించారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే ఆయన చెల్లి పార్టీలోకి పొంగులేటి వెళ్లనట్టు చర్చ నడుస్తోంది.
వైఎస్సార్టీపీలో చేరితే భవిష్యత్ వుండదనే భావనతోనే ఆత్మీయుడైన పొంగులేటిని అటు వైపు జగన్ పంపలేదని సమాచారం. ఇటీవల వైఎస్ జగన్ను పొంగులేటి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఏపీలో పలు కాంట్రాక్ట్ పనుల్ని పొంగులేటి నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జగన్తో పొంగులేటికి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో రాజకీయపరంగా తన చెల్లికి అండదండలు ఇవ్వడానికి జగన్ సుముఖంగా లేరనేందుకు పొంగులేటి చేరకపోవడమే నిదర్శనంగా పలువురు చెబుతున్నారు. జగన్ మాట కాదని తెలంగాణలో షర్మిల సొంత రాజకీయ కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే.