పులివెందుల రాజకీయ రంగస్థలంలో డాక్టర్ వైఎస్ అభిషేక్రెడ్డి ల్యాండ్ అయ్యారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి షేక్ అవుతున్నారు. తన నాయకత్వానికి ముప్పు వాటిల్లుతుందనే భయం అవినాష్ను వెంటాడుతున్నట్టు సమాచారం.
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో వైఎస్ అభిషేక్ భేటీ అయ్యారని సమాచారం. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని రాజకీయాలను పర్యవేక్షించాలని అభిషేక్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
సీఎం జగన్ ఆదేశాలతో రెండు రోజుల క్రితం డాక్టర్ అభిషేక్ పులివెందులకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఫ్యామిలీతో ఉంటున్నారు. డాక్టర్ అభిషేక్ భార్య కూడా వైద్యురాలే. దంపతులిద్దరూ విశాఖలో తమ వృత్తిలో నిమగ్నమయ్యారు. అయితే పులివెందులలో వివేకా హత్యపై విచారణలో భాగంగా సీబీఐ దూకుడు నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.
ఇప్పటికే పులివెందుల నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు చూస్తున్న వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తలపై అరెస్ట్ కత్తి వేలాడుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందే అన్నట్టుగా టెన్షన్ నెలకుంది. దీంతో ఎందుకైనా మంచిదని రాజకీయపరంగా కొందరిని తన చిన్నాన్న వైఎస్ మనోహర్రెడ్డికి అవినాష్రెడ్డి కొంత కాలంగా పరిచయం చేస్తున్నారు.
మనోహర్రెడ్డికి పులివెందుల్లో అంత సీన్ లేదు. ఎందుకంటే, గతంలో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పని చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కుటుంబ సభ్యుల్లో మనోహర్రెడ్డి ప్రముఖుడు. మనోహర్రెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు రీత్యా… డబ్బు కోసం ఏమైనా చేస్తుందనే అభిప్రాయం పులివెందుల నియోజకవర్గంలో వుంది. దీంతో ఆయన వల్ల పులివెందుల నియోజకవర్గంలో వైసీపీకి నష్టమే అన్న అభిప్రాయం శ్రేణుల్లో ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న వైసీపీకి వైఎస్ ప్రకాశ్రెడ్డి కుటుంబమే సరైందనే అభిప్రాయం ఉంది. వైఎస్ ప్రకాశ్రెడ్డి పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ప్రకాశ్రెడ్డి మనవడే డాక్టర్ అభిషేక్. గతంలో ఎన్నికల్లో పనిచేసిన అనుభవం యువకుడైన అభిషేక్కు ఉంది. ప్రస్తుత సమయంలో అభిషేక్ సేవలు వైసీపీకి అవసరమని సీఎం జగన్ భావన. అయితే అందగాడు, ఆలోచనాపరుడైన డాక్టర్ అభిషేక్ పులివెందుల రాజకీయాల్లో ఒక్కసారి ప్రవేశిస్తే, ఇక తన మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుందని అవినాష్రెడ్డి భయపడుతున్నారని పులివెందులలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
డాక్టర్ అభిషేక్కు సీఎం జగన్ రాజకీయ దిశానిర్దేశం చేసినప్పటికీ, అవినాష్ అధికారికంగా బాధ్యతలు అప్పగించడానికి నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఎంత కాలం కాలయాపన చేస్తారో చూడాలి.