ఏపీ శాసనమండలి సభ్యుడు దీపక్ రెడ్డి పేరు మీడియాలో తరచూ వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చర్చా కార్యక్రమాల్లో దీపక్ రెడ్డి చాలా ఉత్సాహవంతంగా పాలుపంచుకుంటూ ఉంటారు. అలాగే శాసనమండలిలో కూడా బాగా స్పందిస్తూ ఉంటారు.
లోకేష్ మీద ఈగ వాలనీయని రీతిలో ఉంటుంది దీపక్ రెడ్డి స్పందన. ఇక తాజాగా మండలిలో మంత్రులను రౌడీలు అంటూ వ్యాఖ్యానించి ఈయన దుమారం రేపారు. దీనికి ప్రతిగా మంత్రి బొత్స సత్యనారాయణ 'చెప్పుతో కొడతాం..' అని స్పందించారు.
ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేసి, మరింత తీవ్ర వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు దీపక్ రెడ్డి. ఆ సంగతలా ఉంచితే.. ఈయన విషయంలో పెద్ద సందేహం ఏమిటంటే.. ఈయనపై టీడీపీ ఎప్పుడు సస్పెన్షన్ ఎత్తి వేసింది? అనేది! దీపక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి కొన్నేళ్ల కిందట సస్పెండ్ చేశారు. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానుసారం ఆ ప్రకటన జరిగింది. అందుకు కారణం ఆయనపై నమోదైన కేసులే!
హైదరాబాద్ లో ఫోర్జరీకి సంబంధించింది దీపక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అది జరిగింది. ఫోర్జరీ, మోసం కేసుల్లో దీపక్ రెడ్డిపై కేసులు నమోదు కావడంతో.. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన విషయంలో డ్యామేజ్ కవరేజ్ కు దిగింది. దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ప్రకటించేసింది.
అలా తెలుగుదేశం పార్టీ అధినేతే దీపక్ రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపారు. ఇప్పుడు దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున బాగా స్పందిస్తున్నారు! మీడియాలో అయినా, మండలిలో అయినా దీపక్ రెడ్డి స్పందన వార్తలకు ఎక్కుతోంది.
జేసీ కుటుంబీకులకు సమీప బంధువు దీపక్ రెడ్డి. 2012లో రాయదుర్గం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఈయన టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల సమయంలో ఆస్తుల ప్రకటనతో సంచలనం రేపారు. దేశంలో అత్యంత ఆస్తులున్న నేతగా నిలిచారు. ఆ తర్వాత ఫోర్జరీ కేసులను ఎదుర్కొన్నారు. భూ కబ్జాల వ్యవహారంలో అరెస్టయ్యారు!
జేసీ సోదరులు ప్రస్తుతం చప్పబడినా.. దీపక్ రెడ్డి మాత్రం వారి స్థానాన్ని భర్తీ చేస్తున్నట్టుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఇలా ఉత్సాహంతో పని చేసిన చాలా మంది రెడ్లలో చాలా మంది కథ ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరిగింది. మరి దీపక్ రెడ్డి ఎంత వరకూ నెట్టుకొస్తారో!