బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. 'తను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవని.. టీడీపీ నేతలతో ఎటువంటి చర్చలు జరపలేదని.. బీజేపీ టికెట్ ఇస్తే పొటీ చేస్తానంటూ' సృష్టం చేశారు.
బీజేపీ నుంచి సస్పెండ్ చేసి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోకపోవడంతో పార్టీ మారే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. తను రాజకీయం మొదలు పెట్టిన టీడీపీ పార్టీలోనే చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తీరా ఈ రోజు ఆ వార్తలను ఖండించారు. కాగా గత సంవత్సరంలో ఓ వర్గంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశం మొత్తం తీవ్ర దూమారం రేగడంతో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో దాదాపు రెండు నెలలు పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే.
కాగా రాజాసింగ్ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్ నియోజకవర్గం నుండి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.