‘నిజం’ మాట్లాడతానంటున్న రామ్ గోపాల్ వర్మ

కాంట్రవర్సీ ఎక్కడుంటే ఆర్జీవీ అక్కడుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ వివాదం చెలరేగినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో, నలుగుర్నీ తనవైపు తిప్పుకోవడంలో వర్మ ఎప్పుడూ ముందుంటాడు. ఈసారి వివేక హత్య కేసు ఈ దర్శకుడ్ని…

కాంట్రవర్సీ ఎక్కడుంటే ఆర్జీవీ అక్కడుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ వివాదం చెలరేగినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో, నలుగుర్నీ తనవైపు తిప్పుకోవడంలో వర్మ ఎప్పుడూ ముందుంటాడు. ఈసారి వివేక హత్య కేసు ఈ దర్శకుడ్ని ఎట్రాక్ట్ చేసింది.

ఈ కేసుపై మొదటి ఎపిసోడ్ తయారుచేసి, 'నిజం' అనే ఛానెల్ ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. “నేను ప్రారంభించబోయే నిజం అనే ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడమే. ఆ బట్టలూడదీసి విసిరి పారేస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది.” అంటూ ప్రకటించుకున్నాడు వర్మ.

నిజం చచ్చిపోయినట్టు నటిస్తుంది తప్ప, దాన్ని ఎవ్వరూ చంపలేరంటున్నాడు వర్మ. అలాంటి నిజాల్ని ఇకపై తను చెబుతానని, కేవలం పొలిటికల్ గానే కాకుండా, అన్ని రకాల సబ్జెక్టులు టచ్ చేస్తానని ప్రకటించాడు.

“నిజం అనే ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి ప్రతి ఎపిసోడ్ లో, నేనే కాకుండా రకరకాల నిపుణులు, ఆలోచనపరులు, రీసెర్చర్స్ వేరే వేరే టాపిక్స్ ని విశ్లేషిస్తారు.”

ఇలా కొంతమందితో కలిసి నిజం ఛానెల్ ను ప్రారంభించబోతున్నాడు వర్మ. వివేకా హత్య వెనక నిజంలో అబద్దముందా ? అనే ఎపిసోడ్ ను నిజం ఛానెల్ లో రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.