ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల మాతృమూర్తిగా విజయమ్మ రోడ్డెక్కాల్సిన దుస్థితి. కుమార్తె కోసం నిరసనకు దిగడం, అలాగే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వైసీపీ శ్రేణుల్ని ఆవేదనకు గురి చేస్తోంది.
కొన్ని గంటల క్రితం వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులపై షర్మిల దాడి చేసుకున్నారని కేసు కూడా నమోదు చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసి కూతురి కోసం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వద్దకు వైఎస్ విజయమ్మ వెళ్లారు. షర్మిలను చూడడానికి అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆమె కోరారు. అందుకు పోలీసులు అంగీకరించలేదు.
దీంతో పోలీస్స్టేషన్ ఎదుట విజయమ్మ నిరసనకు దిగారు. నిరసన విరమించాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. తన కూతురిని కలవడానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసుల్ని విజయమ్మ నిల దీశారు. తనను అడ్డుకోడానికి కారణాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాగైతే ఇక్కడే నిరశనకు దిగాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన చేసే హక్కు తెలంగాణలో లేదా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే తెలంగాణలో వైఎస్సార్టీపీకి అదరణ అంతంత మాత్రంగానే ఉంది.
ఇతర పార్టీల నుంచి చెప్పుకోతగిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా అందరి చూపు బీజేపీ వైపు వుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుండడంతో బీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్లంతా అటు వైపు చూస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి అవకాశం లేని చోట షర్మిల ప్రయత్నిస్తుండడం, కూతురికి మద్దతుగా విజయమ్మ నిలబడడం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో తల్లీకూతుళ్లు నిరసనలకు దిగడం లాంటివి వైసీపీ శ్రేణులకు బాధ కలిగించే అంశాలే.