తగ్గేదేలే అంటున్న జాన్వీ కపూర్

ఓ తెలుగు ప్రాజెక్టులోకి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటే ఆ కిక్కే వేరు. దీనికితోడు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతి పెద్ద సినిమా 'పాన్ ఇండియా' అయిపోయింది. దీంతో ఆటోమేటిగ్గా బాలీవుడ్ బ్యూటీ కావాల్సి…

ఓ తెలుగు ప్రాజెక్టులోకి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుంటే ఆ కిక్కే వేరు. దీనికితోడు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతి పెద్ద సినిమా 'పాన్ ఇండియా' అయిపోయింది. దీంతో ఆటోమేటిగ్గా బాలీవుడ్ బ్యూటీ కావాల్సి వస్తోంది. దీంతో ముంబయి భామలు కొండెక్కి కూర్చున్నారు, టాలీవుడ్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.

నిజానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ రేంజ్ కు వస్తున్నప్పుడు బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకోవాలి. పారితోషికం తగ్గించుకోవాలి. కానీ ఆశ్చర్యంగా హిందీ హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ కు వచ్చేసరికి రేట్లు పెంచేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాతల్ని కూడా తప్పుబట్టాలి.

ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా భారీ రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి జాన్వి కపూర్ కూడా చేరిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కోసం జాన్వి కపూర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

ఈ సినిమా కోసం జాన్వికపూర్ 4 కోట్ల రూపాయలు తీసుకుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జాన్వికి ఏకంగా 5 కోట్ల రూపాయలు సమర్పించుకున్నారట.

బాలీవుడ్ భామలు ఇలా కళ్లుచెదిరే ఎమౌంట్ తీసుకోవడం ఇదేం కొత్త కాదు. సాహో సినిమాలో కత్రినా కైఫ్ కోసం ప్రయత్నిస్తే 7 కోట్లు చెప్పింది. దీంతో 5 కోట్లు ఇచ్చి శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. ఆ 5 కోట్లు కూడా ఆమెకు చాలా ఎక్కువ. హీరోయిన్ కియరా అద్వానీ కూడా బాలీవుడ్-టాలీవుడ్ అనే తేడా లేకుండా ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు జాన్వి కపూర్ కూడా అదే బాటలో నడుస్తోంది.