తెలంగాణ సీఎం కేసీఆర్కు గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య సాగుతున్న బిల్లుల వార్కు ఆమె షాకింగ్ ముగింపు పలకడం చర్చనీయాంశమైంది. కేబినెట్ ఆమోదించి పంపిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే నెలల తరబడి పెట్టుకోవడంపై సుప్రీంకోర్టును కేసీఆర్ సర్కార్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయో పరిమితి బిల్లును తిరస్కరించడంతో పాటు మున్సిపల్ నిబంధనలు, ప్రైవేట్ వర్సిటీల బిల్లులపై వివరణ కోరారు.
మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. వీటిలో ఇప్పటికే మూడు బిల్లుల్ని గవర్నర్ ఆమోదించారు. అలాగే రెండింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మరో రెండింటిని తిప్పి పంపినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. ఇక తమ వద్ద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని రాజ్భవన్ వర్గాలు చెప్పాయి.
సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే కొన్ని గంటల ముందు బిల్లులపై తేల్చేయడం ఆసక్తికర పరిణామం. కేసీఆర్ సర్కార్ పంపిన 10 బిల్లుల్లో కేవలం మూడింటిని మాత్రమే ఆమోదించినట్టైంది. దీంతో కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య బిల్లుల వ్యవహారం మరింత గ్యాప్ పెంచిందని చెప్పొచ్చు. కేసీఆర్ సర్కార్తో గవర్నర్ ఘర్షణకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వ్యవహారం మరింత ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి.