మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐతో పాటు టీడీపీ కూడా చేస్తోంది. వివేకా హత్యపై చంద్రబాబు, లోకేశ్ మొదలుకుని చిన్నాపెద్దా అందరూ మాట్లాడుతున్నారు. సీబీఐ దర్యాప్తులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ… చివరికి వైఎస్ భాస్కర్రెడ్డిని కూడా కటకటాలపాలు చేసింది. వైఎస్ అవినాష్రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని సీబీఐ ఆలోచన చేస్తున్నప్పటికీ, న్యాయస్థానం అడ్డంకిగా నిలిచింది.
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో అసలుసిసలు నిందితుడు సీఎం వైఎస్ జగనే అని చంద్రబాబు, లోకేశ్తో పాటు పలువురు టీడీపీ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, ఇతర నిందితులంతా కేవలం పాత్రధారులే అన్నారు. అసలు సూత్రధారుడు వైఎస్ జగన్ అని ఆరోపించారు.
జగన్కు చెప్పే వివేకాను హత్య చేశారని ఆరోపించారు. సీబీఐ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే అసలు కుట్రదారుడు జగనే అని తేలిపోతుందని వారు అనడం గమనార్హం. సానుభూతి ఓట్ల కోసం వివేకాను హత్య చేయించారన్నారు. కేవలం వివేకా హత్య కేసు నుంచి బయట పడేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని టీడీపీ దర్యాప్తు అధికారులు చెప్పడం విశేషం. జగన్కు నైతిక విలువలు వుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీబీఐ విచారిస్తూ నిందితుల గురించి చెబుతుంటే, టీడీపీ దర్యాప్తు బృందం మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. రాజకీయ కోణంలో సీఎం జగన్ను టార్గెట్ చేయడాన్ని గమనించొచ్చు. మరోవైపు టీడీపీ నేతల విమర్శలను తిప్పి కొట్టడంలో వైసీపీ వెనుకపడింది. టీడీపీ ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పేవాళ్లే కరువయ్యారు. మరోవైపు వివేకా హత్య కేసులో టీడీపీ ఆరోపణలు జనంలోకి వెళుతున్నాయి. రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడంలో వైసీపీ అట్టర్ ప్లాప్ అయ్యింది.