మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల జోస్యాలు చెప్పడం మొదలు పెట్టినట్టున్నారు. గతంలో పోలవరంపై అసెంబ్లీ వేదికగా చెప్పిన జోస్యాలన్నీ ఏమయ్యాయో ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు.
నీ పత్రికలో రాసి పెట్టుకో జగన్ అంటూ విరవీగిన దేవినేని… ఆ తర్వాత ఎన్నికల్లో అహంకారానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదనే చందంగా… అధికారం, ఎమ్మెల్యే పదవి పోయినా ఆయనలో బెదిరించే నైజం మాత్రం అట్లే వుంది.
తాజాగా మంత్రి కొడాలి నాని భవిష్యత్పై మాజీ మంత్రి దేవినేని జోస్యం చెప్పడం గమనార్హం. నానిపై ఎంత అక్కసుతో ఉన్నారో ఆయన మాటలే చెబుతున్నాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ క్యాసినో వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి కొడాలి నాని ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కొడాలి నాని ఇక తప్పించుకోలేరని దేవినేని హెచ్చరించడం నవ్వు తెప్పిస్తోందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
కొడాలి నాని బూతులు తిడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. పాలనా వైఫ ల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
తన సొంత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును తన జిల్లాకు పెట్టినా కనీస కృతజ్ఞత కూడా దేవినేని చూపకపోవడం విమర్శలకు దారి తీసింది. మంచిచెడులతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వాన్ని, కొడాలి నానిని విమర్శించడమే దేవినేని పనిగా పెట్టుకున్నారనేందుకు తాజా ఆరోపణలే నిదర్శనమని అంటున్నారు.