మరోసారి హడావుడి చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

కోపమొచ్చినా, ఆత్రమొచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆపడం కష్టమనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం. తమ హీరోను ఎంతలా వెనకేసుకొస్తారో, కోపమొస్తే అదే రేంజ్ లో ట్రోల్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ నైజం. ఈరోజు…

కోపమొచ్చినా, ఆత్రమొచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆపడం కష్టమనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం. తమ హీరోను ఎంతలా వెనకేసుకొస్తారో, కోపమొస్తే అదే రేంజ్ లో ట్రోల్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ నైజం. ఈరోజు ఈ ఫ్యాన్స్ మరో హంగామాకు తెరదీశారు. ఏకంగా తమ హీరో సినిమాపైనే పుకారు లేపారు.

అవును.. రాధేశ్యామ్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవని, మరోవైపు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని.. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని రాధేశ్యామ్ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారంటూ స్వయంగా కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ పుకారు లేపారు. దీంతో సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ అయింది.

రాధేశ్యామ్ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు నెట్ ఫ్లిక్స్, జీ 5 సంస్థల నుంచి భారీ ఆఫర్ వచ్చిందంట. అటుఇటుగా 400 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఈ సంస్థలు రెండూ పోటాపోటీ పడ్డాయంటూ గ్రూపుల్లో ప్రచారం జరిగింది. రేపోమాపో రాధేశ్యామ్ నిర్మాతలు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారంటూ కథనాలు అల్లేశారు.

దీనిపై వెంటనే నిర్మాతలు అలర్ట్ అయ్యారు. రాధేశ్యామ్ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందంటూ తమకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులకు పొద్దున్నుంచి సమాచారం అందిస్తున్నారు. సాధ్యాసాధ్యాలన్నీ చూసుకొని త్వరలోనే ఓ మంచి రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు.

దీంతో పొద్దున్నుంచి వచ్చిన పుకార్లకు చెక్ పడింది. ఓ పెద్ద సినిమా ఓటీటీలోకి నేరుగా వస్తోందంటూ రాధేశ్యామ్ పై పరోక్షంగా సాగిన ప్రచారానికి తెరపడింది.