హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన అల్లుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి సెటైర్స్ విసిరారు. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేశ్ను ఏమీ రాని దద్దమ్మగా అభివర్ణించారు. అలాగే బాలయ్య మాట్లాడితే ఆరు నెలలైనా అర్థం కాదని వెటకరించడం గమనార్హం.
లోకేశ్ పాదయాత్రలో రోజుకో కామెడీ బావుందంటూ వ్యంగ్యంగా అన్నారు. తెలుగుదేశం పార్టీ రోజు రోజుకూ దిగజారి పోతోందన్నారు. ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోటా గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని లోకేశ్పై లక్ష్మీపార్వతి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పలేక బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని లోకేశ్పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని, కుక్కల్ని పోషిస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను కించ పరుస్తున్నారన్నారు.
చంద్రబాబు సైకో అని… పాపాలు పండిపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. దుబాయ్, స్విట్జర్లాండ్లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టారని లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాతారో ఆయనకే తెలియదన్నారు. బాలయ్య మాట్లాడి ఆరునెలలు అయినా అర్థం కాదని దెప్పి పొడిచారు.
పవన్ కల్యాణ్ చదువుతున్న పుస్తకాలు జ్ఞానం ఎక్కడకి పోయిందని లక్మీ పార్వతి నిలదీశారు. లక్ష్మీపార్వతి దివంగత ఎన్టీఆర్ సతీమణి కావడంతో నందమూరి కుటుంబ సభ్యులపై ఆమె విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది. బాలయ్య, లోకేశ్లకు ఆమె చురకలు అండించడం చర్చనీయాంశమైంది.