జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతను అంతకంతకూ పెంచడానికి ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. అసలే రివర్స్ పీఆర్సీ ఇచ్చారని రగిలిపోతున్న ఉద్యోగులపై ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్నారంటూ ఎల్లో మీడియా సానుభూతి చూపుతోంది.
ఇదే చంద్రబాబు అధికారంలో వుంటే మాత్రం ఉద్యోగులపై విష ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా అధినేతలే రంగంలోకి దిగడం చూశాం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య నెలకున్న పీఆర్సీ వివాదం నేపథ్యంలో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి.
నూతన పీఆర్సీ ప్రకారం జీతాలు పెరగవని, అలాగే హెచ్ఆర్ఏలో కోత విధించిన ప్రభుత్వంపై ఉద్యోగులు మండిపడుతున్న నేపథ్యంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే నాడు చంద్రబాబుతో అన్నమాటలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉద్యోగుల జీతాలపై ఆర్కే షాకింగ్ కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియాలో బాబుతో ఆర్కే జరిపిన సంభాషణ ఏంటో మనమూ తెలుసుకుందాం.
“రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామనుకుంటున్నారు అందరూ. నాన్ ప్లానింగ్. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇటు స్టేట్ గవర్నమెంట్ రెండూ అంతే. ఆ నా కొడుకులకు జీతాలు ఇవ్వడానికే జనం ట్యాక్స్లు కట్టేది” అని ఆర్కే ఆగ్రహంగా అంటారు. బాబు స్పందిస్తూ… “వాళ్లను కూడా లాగాల కదా” అని చంద్రబాబు అంటే, “సరే మీ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం అని ఆర్కే అంటారు. “మీరు చెప్పినవన్నీ కరెక్టే” అని చంద్రబాబు ఒప్పుకుంటారు. కానీ అధికారం లేకపోతే మనమేం చేయలేమని చంద్రబాబు ముక్తాయింపు ఇస్తారు.
జనం ట్యాక్స్లు కట్టే ఆనా కొడుకులకు జీతాలు ఇవ్వడానికా? అని ఆర్కే ఘాటు వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకపోగా, సమర్థించడం విశేషం.
ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఆర్కేని తిట్టే వాళ్లు కూడా ఉద్యోగుల విషయంలో ఆయన కాబట్టి ధైర్యంగా తిట్టారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులపై నెగెటివిటీ ప్రచారానికి తన తిట్లు బాగా ఉపయోగపడుతున్నాయని ఆర్కే సంబరపడుతూ వుండొచ్చు.