సంజీవని అంటే ప్రాణం పోసే మొక్క. సంజీవని గురించి పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పడం తెలిసిందే. రామాయణంలో సంజీవని గురించి ఉంది. శ్రీరాముడు, రావణుడి మధ్య యుద్ధంలో ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బకు రాముడి తమ్ముడు లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడ్డానికి సంజీవని మొక్క అవసరమైంది. సుమేరు పర్వతానికి వెళ్లి సంజీవని మొక్క తీసుకురావాలని హనుమంతుడిని ఆదేశిస్తారు. అయితే ఆ మొక్కని గుర్తించలేక ఏకంగా పర్వతాన్నే ఆంజనేయుడు ఎత్తుకెళుతారు. మొక్క రసంతో లక్ష్మణుడు స్పృహలోకి వస్తారు.
ఇప్పుడీ కథ గుర్తు చేసుకోవడం ఎందుకంటే… సంజీవయ్య అని పేరున్న అధికార పార్టీ ఎమ్మెల్యే …తన నియంతృత్వ చేష్టలతో సొంత పార్టీ ప్రాణాలు పోగొడుతున్నారనే చెప్పేందుకే. సొంత పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టును పోలీసులతో ఎమ్మెల్యే చితక్కొట్టించడంపై కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజీవయ్య చర్యలపై సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు దుమ్మెత్తి పోస్తున్నారు.
సూళ్లూరుపేట నుంచి రెండో దఫా సంజీవయ్య ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇదంతా తన బలమే అనే భ్రమలో ఆయన ఉన్నారు. అదే ఆయనపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నియోజక వర్గంలో శ్రీహరికోటకు చెందిన బాబురెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుని సోమవారం సూళ్లూరుపేట సీఐ, ఎస్ఐ పోలీస్స్టేషన్కు పిలిపించుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టు పెట్టాడనే కారణంతో అతన్ని కుళ్లపొడిచారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ అనుకూల మీడియా ప్రాధాన్యం ఇచ్చి వార్తల్ని ప్రచురించింది.
దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. అసలు తనకు వ్యతిరేకంగా బాబురెడ్డి పెట్టారని చెబుతున్న పోస్టు ఏంటో తెలుసుకుందాం.
“నాయకుడు అనేవాడు కార్యకర్తకూ అండగా వుండాలి. జీవనోపాధి మీద కడుపు కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహం , ఏదో ఒకరోజు నీవు గురికాక తప్పదు. మొదటి నుంచి పార్టీ కోసం, ఒక కార్యకర్తగా నేను ఎంతో కష్టపడి పనిచేశా. ఈ రోజు నాకు మా నాయకుడు మేలు చేయకపోగా, ఉన్న ఉద్యోగం నుంచి కూడా తీసేసి ద్రోహం చేశాడు. మరణం మనిషిని ఒకసారి మాత్రమే చంపుతుంది. కానీ నమ్మక ద్రోహం మనిషిని ప్రతిరోజూ చంపుతుంది” అంటూ బాబురెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అనే ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు.
అదేంటో గానీ, ఆ పోస్టులో ఊరు, పేరు లేకపోయినా, తన గురించే అని ఎమ్మెల్యే సంజీవయ్య భావించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత పార్టీ అని కూడా చూడకుండా చావబాదాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. పోలీసుల దెబ్బకు బాబురెడ్డి చేతులు, వీపుపై వాతలు తేలాయి. ఈ విషయమై వచ్చిన వార్తలు వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
సోషల్ మీడియాను బాగా వాడుకోవాలని ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, కోఆర్డినేటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించిన రోజే… సొంత పార్టీ వారికి బాగా సత్కారం జరిగిందంటూ వైసీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిన్నటి సమావేశంలో జగన్ అన్న మాటల్ని వారు గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. జగన్ ఏమన్నారంటే… “మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మన కేడర్ అత్యంత క్రియాశీలకంగా వుండాలి. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి. ప్రచారాన్ని ఉధృతం చేసుకోవాలి” అని అన్నారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడం అంటే… పోలీసులతో చితక్కొట్టించడమా? అని నిలదీస్తున్నారు.
“అతని కడుపు మీదా మీ ప్రతాపం? అడిగినందుకు…వీపు మీద మీ ప్రతాపం? సూళ్లూరుపేటలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతిలో కార్యకర్తలకు లాఠీలతో సన్మానాలా? జబ్బలు అరిగేలా జెండా మోసి అధికారం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆసరాగా ఉండాల్సిన ఎమ్మెల్యే.. ఆసరా ఇవ్వడం పక్కన పెడితే, కార్యకర్తలనే పోలీసుల సాయంతో ఇలా అతి హేయంగా కొట్టించడం నీచం. బాబురెడ్డికి వైసీపీ అంటే ప్రాణం… ఎంతలా అంటే నిన్న పొద్దున్నే స్టేషన్లో కూర్చోబెట్టినా పార్టీ పోస్ట్లు, జగనన్న గురించి పోస్ట్లు పెట్టేంతగా. ఒంటి నిండా గాయలతో ఉన్నా పోస్టులు పెట్టడం ఆపనంతగా! ఓ బాబురెడ్డి దేనికయ్యా ఇంత పిచ్చి అభిమానం నీకు పార్టీ మీద.. ఉపాధి లేకున్నా అన్న కోసం నిలబడ్డ నీకు? ఎమ్మెల్యే అధికార మదం చూపిస్తే… నీకు తోడుగా నిలబడడానికి సాటి సోషల్ మీడియా సోదరులు ఉన్నారు”
“ఒక ఎస్ఐ రెండు చేతులు పట్టుకొని, ఇంకో సీఐ ఆ రెండు చేతులపై ఇంతలా అతి క్రూరoగా రాక్షసత్వంతో కొట్టాడు అంటే… ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఓ బాబు రెడ్డి నీ వీపుపై ఆ కందిపోయిన రక్తపు చారలు చూస్తుంటే రక్తం మరుగుతోంది”
ఇలా సాగుతోంది సోషల్ మీడియాలో రచ్చ. రెండో దఫా ఎమ్మెల్యే అయిన సంజీవయ్య…నియోజకవర్గంలో ఎవర్నీ లెక్క చేస్తున్న దాఖలాలు లేవు. అంతా నా ఇష్టం అనే రీతిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజా ఘటనతో సంజీవయ్యపై నియోజకవర్గంలో ఉన్న తీవ్రమైన అసంతృప్తి బయటపడుతోంది. సంజీవయ్య వైఖరి వైసీపీకి భారీ నష్టం తెస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో వుంది. అది ఇవాళ్టికి మరింత ఎక్కువైంది. ఈ ఘటనపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.