మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ తీరుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా ముఖంగా ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ కేసులో సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి విచారణ అనంతరం మీడియా ముఖంగా విచారణ సంస్థ తీరును తప్పుపట్టారు. తనను విచారిస్తున్న వైనాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని కోరినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదని, ఒక ల్యాప్ టాప్ ను ముందు పెడుతున్నారని అవినాష్ అన్నారు. అలాగే తనకు ఈ కేసులో సునీతకు సీబీఐ డైరెక్టుగా లీకులు ఇస్తోందని కూడా అవినాష్ అన్నారు.
వివేకానందరెడ్డి హత్యలో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని, ఈ విషయంలో తను పోరాటం చేస్తానంటూ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి మరణం తర్వాత ఆయన ఇంటికి వెళ్లమంటూ తనకు కాల్ చేసిందే వివేక కూతురు, అల్లుడు అని .. వారే తనను అక్కడకు వెళ్లమని చెప్పి .. తనపై కుట్రలో వారు భాగస్వామ్యులు అవుతున్నారని అవినాష్ రెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టుగా తనెప్పుడూ చెప్పలేదని అవినాష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆ రోజు ప్రెస్ మీట్ ను చూసినా ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు.
వివేకానందరెడ్డికి 2006లో ఒక ముస్లిం యువతితో వివాహం అయ్యిందని, వారికో కొడుకు కూడా ఉన్నాడని.. ఆస్తుల తగాదాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఉండవచ్చని అవినాష్ రెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున ఒక లెటర్ ను ఆయన కుటుంబీకులే దాచి ఉంచారన్నారు.
2019 ఎన్నికల్లో వివేకానందరెడ్డి తన తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని, అలాంటాయన రాజకీయంగా తమకు అడ్డు అవుతాడని తాము హత్య చేసినట్టుగా ఎలా ప్రచారం చేస్తారంటూ అవినాష్ రెడ్డి ప్రశ్నంచారు. ఈ కేసులో కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తను న్యాయపోరాటంతోనే ఎదుర్కొంటానంటూ అవినాష్ రెడ్డి ప్రకటించారు.