నాకు సోకింది ఒమిక్రాన్ కాదు.. హీరోయిన్ క్లారిటీ

తనకు కరోనా సోకిన విషయాన్ని హీరోయిన్ కరీనా కపూర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే తను ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని, తన స్టాఫ్ కూడా క్వారంటైన్ లో ఉందని…

తనకు కరోనా సోకిన విషయాన్ని హీరోయిన్ కరీనా కపూర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే తను ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని, తన స్టాఫ్ కూడా క్వారంటైన్ లో ఉందని ప్రకటించింది. అయితే ఈ క్రమంలో ఓ సెక్షన్ బాలీవుడ్ మీడియా, కరీనాకు ఒమిక్రాన్ సోకిందంటూ ప్రచారం చేసింది. దీన్ని సదరు హీరోయిన్ ఖండించింది.

తనకు కేవలం కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని, ఒమిక్రాన్ వేరియంట్ కాదని స్పష్టం చేసింది కరీనా. తనతో పాటు తన స్టాఫ్ మొత్తం 2 డోసుల టీకాలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని బాధ వ్యక్తంచేసింది. కరీనా కపూర్ తో పాటు అమృతా అరోరాకు కూడా కరోనా సోకింది. కరీనా పిల్లలు, ఆమె భర్త సైఫ్ పరిస్థితేంటనేది మాత్రం బయటకు చెప్పలేదు.

మరోవైపు కరీనా కపూర్ పై బాంబే మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన వెంటనే కరీనా కపూర్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని, పైగా నిబంధనలు ఉల్లంఘించి పార్టీలకు వెళ్లిందని ఆరోపిస్తున్నారు. 

బాంద్రాలో ఉన్న కరీనా నివాసానికి సీలు వేసిన అధికారులు.. గడిచిన 4 రోజుల్లో ఎవరెవర్ని కలిసిందనే విషయంపై కరీనా కపూర్ సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా ట్రేస్ చేస్తున్నాని, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కరీనా కపూర్ పిల్లలిద్దరూ తల్లితోనే ఉన్నారని, ఆమె తండ్రి స్పష్టంచేశారు. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని దూరంగా ఉంచకుండా కరీనా కపూర్, నిబంధనలు ఉల్లంఘించిందంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సైఫ్ అలీఖాన్ స్పందించలేదు.

ఆదివారం కరీనాకు జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఆ వెంటనే పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి లక్షణాల్లేవని కరీనా నిన్న ప్రకటించింది.