తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ విడుదల తేదీ గురించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. అక్రమాల వ్యవహారంలో అరెస్టై, విచారణలో దోషిగా నిర్ధారణ అయ్యి, శిక్షను ఎదుర్కొంటున్న శశికళ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుందని పరప్పన అగ్రహార జైలు అధికారులు ప్రకటించారు.
ఆమెకు పడ్డ శిక్ష అమలు 2021 జనవరి 27తో ముగుస్తుందని, ఆ రోజే ఆమె విడుదల అవుతుందని వారు ప్రకటించారు. అయితే ఒకే ఒక షరతు ఉందని, కోర్టు విధించిన 10 కోట్ల రూపాయల జరిమానాను ఆమె చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఒకవేళ ఆ పది కోట్ల రూపాయల జరిమానా కట్టలేకపోతే.. కోర్టు శిక్షా కాలాన్ని పొడిగిస్తుందేమో! అయినా.. శశికళ స్థాయికి ఆ పది కోట్ల రూపాయల పరిహారం కట్టడం ఏ మాత్రం కష్టం కాదు. జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు సుమారు వంద కోట్ల రూపాయల వరకూ జరిమానా విధించింది. వారిపై నమోదైన అభియోగాలు 66 కోట్ల రూపాయల స్థాయివి కాగా, వంద కోట్ల పరిహారం పడింది అప్పట్లో. దానిపై కొందరు నెటిజన్లు తుంటరి కామెంట్లు చేశారు. ఆ పరిహారాన్ని కట్టడానికి వారు మరో స్కామ్ చేయాలా.. అంటూ వ్యాఖ్యానించారు!
జయలలిత మరణించడంతో ఆమెకు పడిన శిక్ష, ఆమెకు పడిన జరిమానా రెండూ వార్తల్లో లేకుండా పోయాయి. శశి శిక్షను పూర్తి చేసుకుంటున్నారు, పది కోట్ల జరిమానా కట్టడం ఆమెకు పెద్ద కష్టం కాదు. తమ అభిమానులే తలా కొంత పోగేశారని.. ఆ డబ్బునే ఆమె జరిమానా కింద చెల్లిస్తోందని లెక్కలను కూడా పక్కగా చెప్పగల ఆమె సన్నిహిత మేధావులు ఉండనే ఉంటారు. కాబట్టి శశికళ విడుదలకు రంగం సిద్ధం అవుతున్నట్టే కాబోలు!