ఎన్టీయార్ కి ఆయన పరమ వీర భక్తుడు. అన్న వారి జయంతి వర్ధంతుల విషయంలో ఎపుడూ ఆయన ముందుండి కార్యక్రమాలు జరిపిస్తారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయన నందమూరి కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు. అంతే కాదు, చంద్రబాబుకు పరమ విధేయుడు.
ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ఆ టీడీపీ ఎమ్మెల్యే మీద ఇపుడు పెద్ద ఎత్తున ప్రచారం ఒకటి జరుగుతోంది. ఆయన జెండా ఎత్తేస్తారని, తొందరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని. నిజానికి ఆయనకు టికెట్ రావడానికి బాలక్రిష్ణ కారణమని చెబుతారు.
మరి బాలయ్యతోనే ఆయన చివరిదాకా ఉంటారని, టీడీపీని ఎంతమంది వీడినా ఆయన సైకిల్ దిగరని ఇప్పటిదాకా అంతా భావించారు. ఈ మధ్య టీడీపీ అధినాయకత్వం పార్టీకి పరమ భక్తులైన ఎమ్మెల్యేల జాబితా తయారు చేసిందని టాక్. అయితే అందులో మొదటి అయిదు పేర్లలో అయనది ఉందిట.
అటువంటి ఎమ్మెల్యే కనుక వైసీపీలోకి జంప్ చేస్తే టీడీపీ పని అయిపోయినట్లేనని రాసుకోవచ్చునని అంటున్నారు. ఎందుకంటే టీడీపీకి అంతకంటే వీర విధేయులు ఉండరు, వారే పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటున్నారు అంటే అక్కడ అన్న గారి మీద భక్తి తగ్గిందని కాదు, బాలయ్య, చంద్రబాబుల మీద అభిమానం పోయిందనీ కాదు, టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగులేదని అర్ధం.
మరి ఆయనని వైసీపీలోకి తీసుకురావాలని క్రిష్ణా జిల్లాకు చెందిన ఒక వైసీపీ మంత్రి గట్టిగానే ట్రై చేస్తున్నారుట. సూత్రప్రాయంగా ఆయన ఓకే చెప్పారని అంటున్నారు. అది జరిగితే మాత్రం టీడీపీకి బాంబు లాంటి న్యూసే మరి.