మళ్లీ ట్విట్టర్ లోకి వివాదాస్పద హీరోయిన్

ఆమధ్య పదే పదే విద్వేషపూరిత ట్వీట్లు చేస్తూ ట్విట్టర్ ఆగ్రహానికి గురైన కంగనా రనౌత్ కి కొత్త మేనేజ్ మెంట్ వెల్కమ్ చెప్పింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత కంగన ట్విట్టర్ అకౌంట్ తిరిగొచ్చేసింది. ఆ…

ఆమధ్య పదే పదే విద్వేషపూరిత ట్వీట్లు చేస్తూ ట్విట్టర్ ఆగ్రహానికి గురైన కంగనా రనౌత్ కి కొత్త మేనేజ్ మెంట్ వెల్కమ్ చెప్పింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత కంగన ట్విట్టర్ అకౌంట్ తిరిగొచ్చేసింది. ఆ ఆనందంలో ఆమె కొత్తగా ట్వీట్ చేసింది. “హెలో ఎవ్రీవన్ ఇట్స్ నైస్ టు బి బ్యాక్ హియర్” అంటూ ట్వీట్ చేసింది కంగన.

సాయంత్రం ఆమె ఈ ట్వీట్ పెట్టగానే అభిమానులు దాన్ని వైరల్ చేశారు. కంగన కమ్ బ్యాక్ ట్వీట్ ని లైక్ లు, రీట్వీట్లతో హోరెత్తించారు. అంతే కాదు, ఎమర్జెన్సీ పేరుతో వస్తున్న తన కొత్త సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది కంగన.

2021 మే లో కంగనా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది. బెంగాల్ లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస విషయంలో కంగన విద్వేషపూరిత ట్వీట్లు వేయడంతో అప్పట్లో ఆమె ట్విట్టర్ అకౌంట్ ని సస్పెండ్ చేశారు. ట్విట్టర్ గైడ్ లైన్స్ ని ఆమె పదే పదే ఉల్లంఘించడంతో ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేశారు. అప్పటికే పశ్చిమబెంగాల్ లో ఎన్నికల అనంతర హింస చెలరేగింది. దానికి మరింత ఆజ్యం పోసేలా కంగన ట్వీట్లు వేసింది.

గతంలో నరేంద్రమోదీ ఎలా ఉండేవారో, అలాంటి స్వభావాన్ని మళ్లీ తెరపైకి తేవాలని.. అలా అయితేనే మమతా బెనర్జీ దారికి వస్తారంటూ రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారు కంగన. అదే ఆమె లాస్ట్ ట్వీట్. ఆ తర్వాత ట్విట్టర్ ఆ అకౌంట్ ని సస్పెండ్ చేసింది.

యాజమాన్యం మారిన తర్వాత ఎలాన్ మస్క్ హయాంలో ట్విట్టర్ కొత్త పుంతలు తొక్కింది. సస్పెండ్ అయిన అకౌంట్లన్నిటినీ పునరుద్ధరిస్తోంది. గతేడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా కూడా తిరిగి లైన్లోకి వచ్చింది. తాజాగా కంగనా రనౌత్ అకౌంట్ కూడా తిరిగి వచ్చేసింది. ఇప్పటికైనా కంగన కామ్ గా ఉంటారా, లేక తన పాత పద్ధతినే కొనసాగిస్తారా..? వేచి చూడాలి.