తిరుపతిలో పాలకమండళ్ల ఏర్పాటు శరవేగంగా!

దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ పచ్చ జెండా ఊపడమే ఆలస్యం….తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వాటి సభ్యుల భర్తీలో దూకుడు ప్రదర్శించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ఆధ్యాత్మికతకు సంబంధించిన…

దేవాలయాల పాలక మండళ్ల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ పచ్చ జెండా ఊపడమే ఆలస్యం….తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వాటి సభ్యుల భర్తీలో దూకుడు ప్రదర్శించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ఆధ్యాత్మికతకు సంబంధించిన దేవాలయాల పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ర్టంలోనే మొట్టమొదటగా కరుణాకరరెడ్డి చొరవ చూపారు. 

తనదైన శైలిలో పావులు కదిపి తిరుపతిలోని నాలుగు ఆలయాల పాలకమండళ్లకు, ఒక్కో ఆలయానికి ఆరుగురు  సభ్యులను నియమింపజేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ పద్మ నుంచి ఉత్తర్వులు తెప్పించారు.  తిరుపతి నగరంలోని అంకాలమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎం.నరసింహులు, ఎం.శివ, ఎం.కృపావతి, ఇ.లక్ష్మి, ఇ.యశోద, పి.మురళి నియమితులయ్యారు. తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యులుగా ఎస్.బాలకృష్ణ, టి.ఉమామహేశ్వరి, పి.అనిల్, హేమావతి, వెంకటరమణ, పద్మజలను నియమించారు. 

వేషాలమ్మ ఆలయ ఆలయ పాలకమండలి సభ్యులుగా అమృతాచారి, వేణుగోపాల్, అశోక్, నాగమణి, మస్తానమ్మ, పద్మ. అలాగే కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యులుగా జె.శరత్కుమార్ శివశంకర్, రెడ్డెమ్మ, నాగయ్య, అనురాధ, పుష్పలతను నియమించారు. హిందువులకు అత్యంత పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుమల కావడంతో ఇక్కడి నుంచి నియామకాలు ప్రారంభిస్తే రాష్ర్ట వ్యాప్తంగా కూడా అన్నీ సక్రమంగా జరుగుతాయని కరుణాకరరెడ్డి  సెంటిమెంట్. 

అంతేకాకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచాలనేదే ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు అభినయ్ రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, నేతలను గుర్తించి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ స్ఫూర్తితో పదవుల పంపకం చేపట్టినట్టు కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి చెబుతున్నారు.