కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తన పార్టీ నాయకులకు కీలక ఆదేశాలిచ్చారు. ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలవాలని అనుకుంటున్న ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కిషన్రెడ్డి కౌంటర్ను పరిశీలించారు. దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్న నాయకులకు ఆయన సుతిమెత్తని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చే నాయకులు మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దని ఆదేశించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా మీడియాతో మాట్లాడితే అలాంటి వారి దరఖాస్తుల పరిశీలనకు తీసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు బీజేపీ క్రమశిక్షణా కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
ఇదిలా వుండగా దరఖాస్తు ఫారంలో నాలుగు విభాగాలున్నాయి. ముఖ్యంగా క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉందా? కేసుల వివరాలను వెల్లడించాల్సిందిగా ప్రత్యేక కాలమ్ను ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి అభ్యర్థికి సంబంధించిన ప్రతి అంశాన్ని బీజేపీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని అర్థమవుతోంది. బీజేపీ సీనియర్ నేతలందరినీ ఎన్నికల బరిలో నిలపాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం.