మరో వ్యాపారవేత్త దేశాన్ని విడిచి పారిపోతాడా?

ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి పారిపోయారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ నుంచి మొదలుపెడితే.. మోదీ పాలనలో మరికొంతమంది బడా వ్యాపారవేత్తలు ఇలా కేసులకు చిక్కకుండా, అందరి కళ్లుగప్పి విదేశాలకు పరారయ్యారు. ఇప్పుడీ…

ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి పారిపోయారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ నుంచి మొదలుపెడితే.. మోదీ పాలనలో మరికొంతమంది బడా వ్యాపారవేత్తలు ఇలా కేసులకు చిక్కకుండా, అందరి కళ్లుగప్పి విదేశాలకు పరారయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో బడా వ్యాపారవేత్త చేరబోతున్నారంటూ బిజినెస్ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పేరు సుభాష్ చంద్ర.

ఇండియాలో జీ గ్రూప్ అనే సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసిన మొదటివ్యక్తి సుభాష్ చంద్ర. మీడియా రంగంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఈయన తనకు సెట్ కాని బిజినెస్ చేసి తీవ్రనష్టాలు ఎదుర్కొన్నారు. మౌళిక రంగంలో ఈయన పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఏకంగా ఆ గ్రూప్ కే పెద్ద విఘాతంగా మారాయి. జీ-ఇన్ ఫ్రా పేరిట సుభాష్ చంద్ర స్థాపించిన గ్రూప్, ఆ కంపెనీకి భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. అటుఇటుగా 12వేల కోట్ల రూపాయల నష్టం మూటగట్టుకుంది.

అయినప్పటికీ వాటిని అధిగమించేందుకు జీ గ్రూప్ ప్రయత్నించింది. కొన్ని షేర్లు అమ్మడం ద్వారా 5వేల కోట్ల రూపాయలు సమీకరించింది. కానీ మిగతా 7వేల కోట్ల రూపాయల్ని సమీకరించడం సుభాష్ చంద్రకు తలకుమించిన భారంగా మారింది. ఒకదశలో తనకు బంగారు బాతులాంటి జీల్(ZEEL) గ్రూప్ లో వాటాను విక్రయించడానికి కూడా ఆయన ముందుకొచ్చారు. కానీ కొన్ని షరతులు విధించడం వల్ల ఇప్పటివరకు ఆ వాటా అమ్ముడుపోలేదు. మరోవైపు భారత్ కు చెందిన బడా ఆర్థిక శక్తులు కొన్ని తెరవెనక పన్నిన పన్నాగం కారణంగా, వాటా కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థలు ముందుకు రాలేదు. ఎవ్వర్నీ ముందుకు రానీయకుండా చేసి, జీ గ్రూప్ లో పెద్ద వాటాను దక్కించుకోవాలనేది వీరి ప్లాన్.

ఈ నేపథ్యంలో.. సుభాష్ చంద్ర కూడా దేశం విడిచి పారిపోతారంటూ ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై పరోక్షంగా స్పందించారు సుభాష్ చంద్ర. ప్రస్తుతం తను ముంబయిలోనే ఉన్నానని, కంటి ఆపరేషన్ చేయించుకున్నానని స్పష్టంచేశారు. అటు ఆయన తనయుడు మాత్రం ఈ పుకార్లను కొట్టిపారేశాడు. జీ ఎంటర్ టైన్ మెంట్స్ కు ఎండీగా వ్యవహరిస్తున్న సుభాష్ చంద్ర తనయుడు, పునీత్ గోయంకా ఈ పుకార్లను ఖండించాడు. తన తండ్రి ముంబయిలోనే ఉన్నాడని, దేశం విడిచి పారిపోలేదని స్పష్టంచేశాడు. ఎప్పటికీ అలాంటి పని చేయడని అన్నారు.

ప్రస్తుతం మార్కెట్ లో జీ షేర్ విలువ పతనావస్థకు చేరుకుంది. 550 రూపాయల వద్ద ఉన్న షేర్ విలువ కాస్తా ప్రస్తుతం 273 రూపాయలకు పడిపోయింది. ఇది త్వరలోనే 200 రూపాయలకు కూడా వస్తుందంటున్నారు నిపుణులు. సెన్సెక్స్ భారీగా పెరిగిన టైమ్ లో కూడా జీ షేర్ పుంజుకోలేదంటే మార్కెట్లో ఈ సంస్థపై ఎంత ప్రతికూల పవనాలు వీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటి నుంచి బయటపడేందుకు గ్రూప్ ప్రయత్నిస్తున్నప్పటికీ, కొన్ని ఆర్థిక శక్తులు సృష్టిస్తున్న పుకార్ల కారణంగా జీ షేర్ పుంజుకోవడం లేదు.

వాటా కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ప్రస్తుతం అంతర్గతంగానే నష్టనివారణ చర్యలు చేపడుతోంది జీ సంస్థ. రోజువారీ ఖర్చులు, బడ్జెట్ ను నియంత్రణలో ఉంచుకుంటూ వస్తున్న లాభాల్ని అప్పులు తీర్చేందుకు కేటాయిస్తోంది. అన్ని భాషల్లో సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకునే వ్యాపారాన్ని ఆపేయడంతో పాటు.. హిందీలో సినిమాలు నిర్మించే జీ స్టూడియోస్ సంస్థకు నిధుల్లో  భారీగా కోత విధించింది.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?