జగన్ పాలనలో మరో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్పై దాడి, అలాగే మాజీ మంత్రి వివేకా హత్య కేసులలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తు తేలకముందే డాక్టర్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు నెలల తరబడి సాగుతూనే వుంది.
చివరికి సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు తలెత్తిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరగదని, మరో రాష్ట్రానికి మార్చాలంటూ వివేకా కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై తుది తీర్పు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇదిలా వుండగా తాజాగా నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కేసుకు సంబంధించి కీలక పత్రాలు నెల్లూరు నాలుగో అదనపు జిల్లా సివిల్ జడ్జి కోర్టు నుంచి అపహరణకు గురయ్యాయి. గత ఏప్రిల్లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనిపై విచారించిన పోలీసులు ఆకతాయిల చోరీగా తేల్చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకు కీలక నివేదిక సమర్పించారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరిగా లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారిస్తే తప్ప నిజానిజాలు బయటపడవని ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రా విచారణ జరిపారు.
సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని గతంలో అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పడంతో, ఆ దిశగానే అడుగులు పడ్డాయి. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించడంతో చర్చనీయాంశమైంది. సీబీఐ దర్యాప్తుతో అయినా వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆశిద్దాం.