తెలంగాణలో ఈడీ, సీబీఐ దాడులు టీఆర్ఎస్ నేతల్ని భయపెడుతున్నాయి. ఏదో ఒక సాకుతో తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, కుమారుడు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ, వివిధ కార్యాలయాల్లోనూ తెల్లవారుజాము నుంచి ఐటీదాడులు జరుగుతున్నాయి.
ఐటీ దాడులు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడులను తాము ముందుగానే ఊహించామన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక బీజేపీ తమను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ నాయకులు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తామేంటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ రోజు వ్యవస్థలు మీ చేతిలో ఉందొచ్చని, రేపు తమ చేతిలోకి రావచ్చని ఆయన బీజేపీని ఉద్దేశించి అన్నారు. కేంద్ర సంస్థల దాడులకు టీఆర్ఎస్ నాయకత్వం భయపడదని స్పష్టం చేశారు. ఒకవేళ తాము భయపడే పరిస్థితి ఎదురైతే హైదరాబాద్లో ఎందుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతున్నదో అర్థం కావడం లేదన్నారు. కొందర్ని టార్గెట్ చేయడాన్ని అందరూ చూస్తున్నారన్నారు. అవసరమైతే వ్యవస్థలపై ప్రజల్ని చైతన్యపరిచి తామేంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా వుండగా మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి సమావేశం కావడం చర్చనీయాంశమైంది.