ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఏదో ఒకటి విమర్శించకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నిద్ర పట్టేలా లేదు. సోషల్ మీడియాలో లేదా బహిరంగ సభల్లో జగన్ను తిట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ను చంద్రబాబు టార్గెట్ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ మరీ చిల్లరమల్లర విషయాలను తీసుకుని బాబు విమర్శలు చేయడమే విడ్డూరంగా వుంది.
తన అనుకూల మీడియా నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విషపు రాతలు రాయడమే పనిగా పెట్టుకుంది. వాటిని తీసుకుని చంద్రబాబు, ఆయన మనుషులు నోరో లేదా ట్వీటో పారేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా జగన్ సభలో నల్ల వస్త్రాలను ధరించిన వాళ్లను అనుమతించలేదని ఎల్లో మీడియాలో ఓ వార్త వచ్చింది. దాన్ని తీసుకుని చంద్రబాబు పండుగ చేసుకున్నారు. సదరు ఎల్లో పత్రిక కథనాన్ని షేర్ చేస్తూ, బాబు ట్వీటాడారు.
“ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణం. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయం! ఇదంతా పోలీసు భద్రత కాదు… జగన్ రెడ్డి అభద్రత”
ఇవే చివరి ఎన్నికలని, ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలంటూ గద్గద స్వరంతో జనాన్ని వేడుకోవడం వెనుక… భయమా? ధైర్యమా? …ఏది ఉందో చంద్రబాబు చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒళ్లంతా పిరికితనం, అధైర్యాన్ని నింపుకుని, ఈ దఫా అవకాశం ఇవ్వకపోతే తనకిక వీడ్కోలే తరువాయని ఏడుస్తూ చెబుతున్న నాయకుడు కూడా జగన్ అభద్రతలో వున్నాడని చెప్పడం విడ్డూరంగా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాట మరెవరైనా అని వుంటే కాస్త నమ్మశక్యంగా వుండేది. చంద్రబాబు అనడం కామెడీని తలపిస్తోంది.