ప్రముఖ సీరియల్ నటి ప్రాణాలతో కొందరు నెటిజన్లు చెలగాటమాడారు. సజీవంగా ఉన్న ఆమె…చనిపోయిందని ఓ తప్పుడు వార్తను ప్రచారంలో పెట్టారు. దీంతో కొందరు ఆవేదనతో నివాళి కూడా అర్పించారు. తీరా చూస్తే సదరు నటి “అయ్యా నేను బతికే ఉన్నా”నంటూ నెత్తీనోరూ కొట్టుకుంటూ సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సిన దుస్థితి.
ప్రముఖ టీవీ నటి, ‘థప్కీ ప్యార్ కీ’ సీరియల్ ఫేం జయా భట్టాచార్య చాలా మందికి తెలుసు. ఆమెపై కొందరు కక్ష కట్టి వ్యవహరించారు. జయా భట్టాచార్య కరోనాతో మృత్యువాత పడ్డారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. నెగిటివిటికి ఉన్న ప్రచారం…పాజిటివ్ అంశాలకు ఉండదనే విషయం తెలిసిందే.
దీంతో జయా భట్టాచార్య మృతికి సంబంధించిన పోస్ట్ వైరల్ అయింది. కొంత మంది అభిమానులు ఆమెకి నివాళి కూడా అర్పిస్తూ ఫొటోలు కూడా షేర్ చేశారు. సోషల్ మీడియాలో తన మృతికి సంబంధించిన పోస్టింగ్లు చూసిన జయా షాక్కు గురయ్యారు.
దీంతో ఆమె షాక్ నుంచి తేరుకుని తాను ఆరోగ్యంగా ఉన్నానని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు, తన గురించి ఏమీ తెలియకుండా, నిజానిజాలతో సంబంధం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో జయా భట్టాచార్య మూగజీవాల ఆకలి తీర్చారు. అలాగే ఆకలితో రోడ్డున పడ్డ సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లకు సైతం ఆమె అండగా నిలిచారు. అందుకే ఆమెను టార్గెట్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.