అప్పుడు బ్లాక్ చేశాడు..ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు

ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు దర్శకుడు హరీష్ శంకర్. దీంతో ఉన్నఫలంగా కనిపించిన ప్రతి ఎకౌంట్ ను బ్లాక్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు అలా బ్లాక్ చేసిన…

ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు దర్శకుడు హరీష్ శంకర్. దీంతో ఉన్నఫలంగా కనిపించిన ప్రతి ఎకౌంట్ ను బ్లాక్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు అలా బ్లాక్ చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు.

ఇంతకీ ఏం జరిగింది

గతంలో అల్లు అర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాథమ్-డీజే అనే సినిమా చేశాడు హరీష్ శంకర్. వసూళ్ల విషయంలో ఆ సినిమా వివాదాస్పదమైంది. పవన్ కల్యాణ్ సినిమాను మించి డీజే వసూళ్లను చెప్పడంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సెగ హరీష శంకర్ ను గట్టిగా తాకింది. దీంతో చాలా ఎకౌంట్లను అప్పట్లో బ్లాక్ చేశాడు హరీష్.

తాజాగా పవన్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు హరీష్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ నుంచి తాకిడి ఎక్కువవ్వడంతో మరికొంతమందిని బ్లాక్ చేశాడు. అలా చాలామంది పవన్ అభిమాలకు హరీష్ ట్విట్టర్ ఎకౌంట్ అందుబాటులో లేకుండా పోయింది.

ఇప్పుడేంటి ఇబ్బంది

పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాకు సంబంధించి అప్ డేట్ రాబోతోంది. ఆ మూవీకి సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేస్తారా, ప్రీ-లుక్ పోస్టర్ ఇస్తారా అనే విషయాన్ని పక్కనపెడితే.. హరీష్ శంకర్ ఎకౌంట్ నుంచి మాత్రం ట్వీట్ పెట్టొద్దని ఇప్పటికే నిర్మాతలకు విజ్ఞప్తులు ఎక్కువైపోయాయి.

హరీష్ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి పోస్ట్ పడితే, అది చాలామంది అభిమానులకు చేరదు. అసలే ట్విట్టర్ లో ట్రెండింగ్ సీజన్ ఇది. ఆల్రెడీ ఉన్న కొంతమంది హీరోల ట్రెండింగ్ రికార్డుల్ని పవన్ ట్రెండ్ తో చెరిపేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో హరీశ్ శంకర్ ఎకౌంట్ నుంచి పోస్ట్ పెడితే.. రీట్వీట్లు, లైకులు కష్టమైపోతాయి.

సో.. అప్పట్లో బ్లాక్ చేసిన తమ ఎకౌంట్లను మళ్లీ యాక్టివ్ చేయమని చాలామంది హరీష్ ను అడుగుతున్నారు. మరికొందరు మాత్రం హరీష్ తో సంబంధం లేకుండా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఇకపై మైత్రీ మూవీ మేకర్స్ ఎకౌంట్ నుంచి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే ట్రెండింగ్ సాధ్యమంటున్నారు.

మొత్తానికి ''హరీష్ ఎకౌంట్ వద్దు.. మైత్రీ ఎకౌంట్ ముద్దు'' అనే స్లోగన్ ప్రస్తుతం పవన్ అభిమానుల మధ్య జోరుగా నడుస్తోంది. మరి ఈ విజ్ఞప్తులు మైత్రీ నిర్మాతల వరకు వెళ్లాయో లేదో..!