మూడు నెలల కిందట ప్రపంచం మొత్తం వుహాన్ పేరు చెబితే బెంబేలెత్తిపోయింది. చైనాలోని ఆ నగరంలో కరోనా కల్లోలం తీవ్ర స్థాయిలో ఉండటంతో.. వుహాన్ అంటేనే అదో భయంకరమైన పేరులా ధ్వనించింది. మార్చి నెలలో ఇవే తేదీల్లో ప్రపంచ వ్యాప్తంగా వుహాన్ పేరు మార్మోగింది. వుహాన్ లో కరోనా కేసుల 50 వేలకు చేరాయని, అనేక మంది కరోనా వైరస్ తో మరణించారని, అక్కడ పటిష్టమైన లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారని.. ఇలాంటి వార్తలు వచ్చాయి. ఆ పరిస్థితిని ఊహించుకుని ప్రపంచమే భయపడింది. వుహాన్ తరహా పరిస్థితి రాకూడదని అనేక దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇండియా కూడా ఆ తర్వాత రెండు వారాలకు లాక్ డౌన్ ప్రకటించింది.
కట్ చేస్తే..ఇప్పుడు ఇండియాలోని ఒక నగరం కరోనా కేసుల విషయంలో వుహాన్ తో సమానమైన స్థితికి వచ్చింది! మూడు నెలలు ముగియకముందే వుహాన్ స్థాయిలో కేసులు రిజిస్టర్ అయిన నగరంగా నిలుస్తోంది ముంబై. దేశంలో లాక్ డౌన్ మినహాయింపులు మొదలయ్యాకా భారీగా కేసులు పెరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ఇప్పటి వరకూ దాదాపు 50 వేలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. వుహాన్ కన్నా ఇప్పుడు ముంబైలో కేవలం కొన్ని వందల కేసులు మాత్రమే తక్కువున్నాయట. మరో ఒకటీ రెండు రోజుల్లో వుహాన్ ను కరోనా కేసుల విషయంలో ముంబై అధిగమించడం ఖాయమేనేమో!
కరోనా నివారణలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్ విధానం దేశంలో కొన్ని చోట్ల విఫలం అయ్యిందని ఐసీఎంఆర్ కూడా చెబుతూ ఉంది. ఆ విషయంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు విజయవంతం కాలేకపోతున్నాయని ఐసీఎంఆర్ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, హర్యానా వంటి రాష్ట్రాలు టీటీటీ విషయంలో సరిగా వ్యవహరించారని ఐసీఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి.
ఆ నాలుగు రాష్ట్రాలు పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని, మహారాష్ట్ర, గుజరాత్ , తమిళనాడు, ఢిల్లీ, బెంగాల్ లు ఈ విధానం విషయంలో వెనుకబడ్డాయని వారు విశ్లేషిస్తున్నారు.