మీ మనుషులతోనే మీటింగా మెగాస్టారూ?

సినిమా సమస్యలపై మెగాస్టార్ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసారు. పాల్లొన్న డైరక్టర్లు ఎవరయ్యా అంటే ఆచార్య సినిమా డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ, చాలా అంటే చాలా కాలం తరువాత సినిమా డైరక్ట్ చేయబోతున్న…

సినిమా సమస్యలపై మెగాస్టార్ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసారు. పాల్లొన్న డైరక్టర్లు ఎవరయ్యా అంటే ఆచార్య సినిమా డైరెక్ట్ చేస్తున్న కొరటాల శివ, చాలా అంటే చాలా కాలం తరువాత సినిమా డైరక్ట్ చేయబోతున్న మెహర్ రమేష్, అది కూడా మెగాస్టార్ తోనే, గతంలో మెగాస్టార్ తో సినిమాలు చేసిన వివి వినాయక్. ఈ ముగ్గురే. 

టాలీవుడ్ లో టాప్ డైరక్టర్లు అయిన రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వంశీపైడిపల్లి, బోయపాటి ఇలా చాలా మంది కనిపించలేదు. రాజమౌళి విదేశాల్లో వున్నారు. మరి మిగిలిన వారిని ఎందుకు పిలవలేదు. కేవలం 'తన' డైరక్టర్లనే చిరు పిలిచారా? వాళ్లే దర్శకులా?  పైగా త్రివిక్రమ్, బోయపాటి, సుకుమార్ ల భారీ సినిమాలు ముందు వున్నాయి. 

మెహర్ రమేష్ సినిమా అన్నది ఇంకా చాలా దూరం వుంది. వినాయక్ చేతిలో తెలుగు సినిమా లేనే లేదు. వైకాపా ఎమ్మెల్యే సోదరుడు పూరి జగన్నాధ్ ను పక్కన పెట్టారు. జగన్ తో మంచి సంబంధాలు వున్న మహి ని అసలు గుర్తించడమే లేదు. 

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అక్కడ కనిపించని డైరక్టర్లను పిలవలేదనే తెలిసింది. మరి మెహర్ రమేష్, కొరటాల, వినాయక్ లను ఎవరు పిలిచారు అని విచారిస్తే మెగాస్టార్ నే స్వయంగా పిలుచుకున్నారని సమాధానం వచ్చింది. 

గమ్మత్తేమిటంటే హీరో బాలకృష్ణ, సీనియర్ హీరో మోహన్ బాబు, లను కూడా పిలచినట్లు లేదు. చూస్తుంటే వివాదం కావాలనే మెగాస్టార్ ఆలోచిస్తున్నట్లుంది అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు సమస్య పరిష్కారం కాకుండా, వివాదాస్పదం చేయాలనే మెగాస్టార్ అండ్ కో ఇలా చేస్తున్నారని టాలీవుడ్ లో పలువురు అంటున్నారు.