వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయంగా వేసిన తప్పటడుగుతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన కూతురు షర్మిలకు అండగా నిలబడేందుకు విజయమ్మ తపించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాను ఏ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని వీడాల్సి వస్తున్నదో భావోద్వేగంతో ఆమె చెప్పారు.
తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తన మద్దతు అవసరం ఉందని, అందుకే అక్కడికి వెళ్లాల్సి వస్తోందని ఆమె చెప్పారు. షర్మిలకు మద్దతుగా తెలంగాణలో నిర్వహించిన పలు సభల్లో విజయమ్మ ప్రసంగించారు. తన బిడ్డను మీ చేతల్లో పెడుతున్నానని, తండ్రి వైఎస్సార్లా పట్టుదల, ప్రజాసేవ చేయాలనే పట్టుదల కలిగిన నాయకురాలని ప్రజలకు వివరించారు. చివరికి ఎన్నికల బరి నుంచి షర్మిల తప్పుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకోడానికి షర్మిల తనకు తోచిన వివరణలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పినా ఆమె మాట పట్టించుకునేవాళ్లు లేరు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ విజయమ్మ ఎటూ చెల్లకుండా పోయారేమో అనే అనుమానం తలెత్తింది. బిడ్డపై విపరీతమైన ప్రేమాభిమానాలే విజయమ్మను వైసీపీకి, ఆంధ్రా రాజకీయాలకు దూరం చేశాయనే అభిప్రాయం కలిగిస్తోంది. తన మాట కూడా వినకుండా తెలంగాణలో తొందరపడి రాజకీయ పార్టీని స్థాపించిన షర్మిలకు మద్దతుగా వుండాలని విజయమ్మ వెళ్లడమే తప్పని పలువురు అంటున్నారు.
ప్రజలు తెలివైన వాళ్లని, కుటుంబ సమస్యల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాటకాలు ఆడాలని అనుకుంటే ఒప్పుకోరని చెబుతున్నారు. ఏపీలో కూడా ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. వైసీపీతో బంధాన్ని తెంచుకున్న విజయమ్మ, తెలంగాణలో కలియతిరిగి, ఇప్పుడు తనయుడి కోసం ఏపీలో రాజకీయాలు చేస్తానంటే బాగోదేమో అని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.
ఏది ఏమైనా ఏ మాత్రం అవకాశం లేని తెలంగాణలో బిడ్డ కోసం విజయమ్మ వెళ్లి, ఆంధ్రాలో రాజకీయంగా తిరగకుండా తనను తాను శిక్షించుకున్నారేమో అనే చర్చకు తెరలేచింది.