రాజకీయ పార్టీలు సహజంగానే రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తుంటాయి. విపత్తు సమయంలో రాజకీయాలు మాట్లాడొద్దని ఒక వైపు చెబుతూనే, మరోవైపు అదే పని చేయడం రాజకీయాల్లో కొత్తకాదు. పరస్పర రాజకీయ విమర్శలను ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోరు. అయితే విపత్త సమయంలో ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే సాహసం ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు.
కానీ జగన్ ప్రభుత్వంపై కక్షతో ఏకంగా రాష్ట్ర ప్రజలకు ఏ చిన్నసాయం అందడం కూడా ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. తాను సాయం చేయకపోగా, చేసే వాళ్లపైన కూడా అక్కసు వెళ్లగక్కుతోంది. ప్రజలకు చేయూతనిచ్చేందుకు ముందుకొస్తున్న వాళ్లపై బహిరంగంగానే అసూయ కనబరుస్తూ టీడీపీ నేతలు తమ నీచత్వాన్ని బయట పెట్టుకున్నారు. టీడీపీ నేతల అమానవీయ చర్యను సభ్య సమాజం “థూ..”అని అసహ్యించుకునే ఘటన గురించి తెలుసుకుందాం.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కరోనాలో కూడా రాజకీయ ప్రయోజనాలను వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా, మండలస్థాయి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలువురు టీడీపీ నేతలు జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త ప్రకారం…స్థానిక ఎన్నికల కోసం వైసీపీ నాయకులు తాపత్రయపడుతున్నారని, అందుకే తప్పుడు లెక్కలు ముందుకు వస్తున్నాయని ఓ టీడీపీ నేత విమర్శించారు.
ప్రజల ప్రాణాలపై వారికి శ్రద్ధ లేదని, ప్రభుత్వ అసమర్థత వల్లే కరోనా వ్యాపిస్తోందని ఆయన ఆరోపించారు. వైద్యులకు రక్షణ సామగ్రి ఇవ్వకుండా ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొంటోందని కర్నూలు జిల్లా నేత ఒకరు చెప్పారు. కానీ ఎందుకనో జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించిన ఆ నేతలెవరో పేర్లు రాయలేదు. మరి నిజాలు మాట్లాడుతున్నప్పుడు పేర్లు రాసుకోలేని దుస్థితి ఏంటో వాళ్లకే తెలియాలి.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే…ముఖ్యమంత్రి సహాయ నిధికి వివిధ వర్గాల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారంటూ కొందరు నాయకులు చెప్పారని రాసుకొచ్చారు. టీడీపీ నేతల నీచత్వం, అల్పత్వం, అమానవీయత, అమానుషం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో….ఈ ఒక్క వాక్యమే ప్రతిబింబిస్తోంది. కరోనా విపత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు సినీ సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చి తమ శక్తి మేరకు కోట్లాది రూపాయలు మొదలుకుని లక్షలు, వేలు అందజేస్తున్నారు.
మరి 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన మొత్తం కేవలం రూ.10 లక్షలు. అది కూడా మొక్కుబడిగా అందజేసి, డిమాండ్లు మాత్రం కోట్లలో చేయడం చంద్రబాబు , ఆయన అనుచరులకే చెల్లుతుంది. రూ.10 లక్షల విరాళానికి రూ.10 వేల కోట్ల ప్రచారం పొందాలనే యావ చంద్రబాబుది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం బలవంతం చేస్తోందనే విమర్శతోనే, ఆ పార్టీ మిగిలిన విషయాల్లో చేసే ఆరోపణల్లో వాస్తవికత ఏంటో అర్థమవుతోంది.
ఏపీ ప్రజలను ఆదుకునేందుకు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ముందుకు రాకపోగా…వస్తున్న వాళ్లపై బురద చల్లే ప్రయత్నాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికారం పోతానే టీడీపీ నేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఎందుకింతగా దిగజారిపోతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.