రాజాంకి భారీ ఆఫర్.. ఆయనకో బెర్త్…?

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ పదవీకాలం ఇంకా రెండేళ్ల దాకా ఉంది. ఇంతలోనే ఏదో కొంప మునిగేటట్లుగా విపక్షాలు ఎన్నికల యుద్ధాన్ని స్టార్ట్…

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ పదవీకాలం ఇంకా రెండేళ్ల దాకా ఉంది. ఇంతలోనే ఏదో కొంప మునిగేటట్లుగా విపక్షాలు ఎన్నికల యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. పోనీ వారికి అదే పని అనుకున్నా అధికార వైసీపీ కూడా దూకుడు పెంచేసింది. టికెట్ల ఖరారు తో పాటు మినిష్టర్ పోస్టులను కూడా వరసబెట్టి అధినాయకుడు జగన్ కూడా ఆఫర్ చేస్తున్నారని టాక్.

ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలు, నాయకులతో మొదలెట్టిన పార్టీ మీటింగ్స్ ఇపుడు కాస్తా దాటి ముందుకు వచ్చి క్యాడర్ తో వరస భేటీలు వేసే దాకా వెళ్ళింది. ఇక కుప్పంతో మొదలెట్టిన జగన్ ఉత్తరాంధ్రాకు ప్రయారిటీ ఇస్తూ తాజాగా రాజాం నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జగన్ కార్యకర్తలతో మాట్లాడుతూ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులునే గెలిపించాలని కోరారు. ఆయన ఈసారి గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తామని జగన్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే 2024 తరువాత వైసీపీ గెలిస్తే ఇక్కడ జోగులు విజయం సాధిస్తే ఆయనే మంత్రి అన్న మాట. అలా కాబోయే మంత్రుల జాబితాను కూడా జగన్ ఈ భేటీల సందర్భంగా ప్రకటించడం విశేషం అంటున్నారు.

ఇక కంబాల జోగులుకు మంత్రి పదవి కంటే మంచి మాట జగన్ నోట దొరికింది అంటున్నారు. అదేంటి అంటే 2024 ఎన్నికల్లో ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈ విషయంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారానికి తెర వేస్తూ జగన్ జోగులుకే టికెట్ అనడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా రాజాం మీటింగ్ కాదు కానీ జోగులు కి డబుల్ గిఫ్టులే జగన్ ఇచ్చారని అంటున్నారు.