ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపై క‌న్నీటి సిరాతో…

ఇక లక్ష్మీ ప్రసాద్, హరికృష్ణ , బాలకృష్ణ, చంద్రబాబు, నా విషయాలకు వద్దాం. Advertisement రామారావు గారు పదవీచ్యుతుడు కావడం సంఘటన  ఎలా జరిగిందనేది ఈ కథ సారాంశం. రామారావు గారిని దించటం సాధారణ…

ఇక లక్ష్మీ ప్రసాద్, హరికృష్ణ , బాలకృష్ణ, చంద్రబాబు, నా విషయాలకు వద్దాం.

రామారావు గారు పదవీచ్యుతుడు కావడం సంఘటన  ఎలా జరిగిందనేది ఈ కథ సారాంశం. రామారావు గారిని దించటం సాధారణ పరిస్థితుల్లో  అయితే  రామోజీరావుగారికి గానీ, లక్ష్మీపార్వతికి గానీ సాధ్యపడే విషయం కాదు. ఎందు చేతనంటే 270 మంది శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి రామారావు గారు. చంద్రబాబుకు కూడా రామారావు గారిని దించే ధైర్యం , సాహసం లేదు . అయితే ఇది ఎలా సంభవించింది?

లక్ష్మీపార్వతి, లక్ష్మీప్రసాద్ (యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్‌, ప్ర‌స్తుత ఏపీ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు) ల మధ్య వైరం ఈ పరిస్థితికి దారి తీసిందనేది ఈ కథనంలో సారాంశం. అది ఎట్లా అంటారా ..1989  ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత లక్ష్మీ ప్రసాద్ రామారావు గారికి చేరువయ్యారు. అంతకు ముందు వరకు అంత పెద్దగా పరిచయం లేదు. రామారావు గారు  ఎక్కువ సమయం ఖాళీగా ఉండేవారు. ఆ సందర్భంలో లక్ష్మీప్రసాద్‌తో  సాహిత్య చర్చలు ఇతరత్రా మాటామంతీ చేస్తూ ఉండేవారు. ఈ విషయాలలో  లక్మీ ప్రసాద్ దిట్ట. హిందీ  భాషలో నిష్ణాతుడు.

రామారావు గారు  హిందీ లో సినిమా తీసేటప్పుడు రామారావుగారితో ఎక్కువ సమయం గడుపటానికి సాధ్య పడేది.  1993 తర్వాత లక్ష్మీపార్వతి ప్రవేశంతో ఈ అవకాశం లక్ష్మీప్రసాద్‌కు తగ్గిపోయింది. 1994లో  ఎన్నికలైన తర్వాత మరింతగా … లక్మీపార్వతి కూడా సాహిత్య ప్రవేశం ఉన్న మనిషి. సహజంగా రామారావు గారికి అంత సన్నిహితంగా ఉన్న లక్మీ ప్రసాద్  ఒక్కసారిగా రామారావు గారికి దూరం కావడం మూలాన లక్ష్మీపార్వతి మీద సహజంగానే ద్వేషం పెరిగింది.  అది ఎక్కడి వరకూ వెళ్ళిందంటే 1995లో రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసే వరకు వెళ్ళింది.

రామారావు గారు రాజీనామా చేసిన టెక్కలి సీటును మొదట లక్ష్మీపార్వతికి అనుకోవడం జరిగింది.  అయితే లక్ష్మీప్రసాద్ ప్రోద్బలంతో హరికృష్ణ దీనిని వ్యతిరేకించి తనకు ఈ సీటు కావాలని అడగడం జరిగింది. లక్ష్మీప్రసాద్ హరికృష్ణకు చాలా దగ్గరగా ఉండేవాడు . లక్ష్మీప్రసాద్ ఎలాగైనా లక్ష్మీపార్వతిని నిలువరించాలనే నిశ్చయంతో ఉన్న వ్యక్తి.  చివరికి అప్పయ్య దొరను టెక్కలి సీటుకు ఎంపిక చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే లక్ష్మీప్రసాద్ – లక్ష్మీపార్వతిల మధ్య వివాదం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా బహిరంగ సభలు పెట్టాలని హరికృష్ణకు ఉద్బోధించడంతో రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసే ఘట్టానికి నాంది పడింది.

మొదట నిజామాబాద్, తెనాలి సభలు విజయవంతం అయ్యాయి.  సభలో ముఖ్య సారాంశం, టార్గెట్ లక్ష్మీపార్వతి. ఇదే చంద్రబాబుకు రామారావు గారిని దించటానికి ధైర్యం కలిగించిన అంశం.  తర్వాత సభగా విజయవాడను ఎన్నుకోవడం జరిగింది. రామారావు గారు ఈ సభలను నిలువరించలేదు. పై పెచ్చు నాటి విజయవాడ  శాసనసభ్యులు , మంత్రిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ రామారావు గారి వద్దకు వచ్చి హరికృష్ణ సభను విజయవంతం చేయడానికి తన సహాయం కోరాడని, తన కర్తవ్యం ఏమిటని అడగగా రామారావు గారు ఆ సభకు తోడ్పడమని ప్రోత్సహించారు . 

ఈ విషయాన్ని నెహ్రూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అంతే కాకుండా రాబోయే కాలంలో హరికృష్ణ మీకు నాయకుడు అని కూడా రామారావు గారు నెహ్రూతో చెప్పారు . ఈ విషయాన్ని నెహ్రూ లక్ష్మీప్రసాద్‌తో చెప్పగా , ఇద్దరూ కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. ఈ విషయమై చంద్రబాబు స్పందనను నెహ్రూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో స్పష్టంగా చెప్పారు.

హరికృష్ణ నాయకుడు అనే మాట రుచించక రామారావు గారిని, హరికృష్ణను చంద్రబాబు దూషించాడు. ఆ దూషణలు వ్రాయ టానికి అనువైన భాష కాదు. చాలామంది నెహ్రూ ఓపెన్  హార్ట్ విత్ ఆర్కేలో చూసి ఉంటారు. విజయవాడ సభ విజయవం తమైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే రామారావు గారికి తన కుమారులలో ఎవరైనా జనసామాన్యంలోకి వెళ్లే  సామర్థ్యం ఉండి సక్సెస్ అయితే  వారిని ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నారనేది విస్పష్ట్టం. అయితే రామారావు గారు చెప్పిన ఈ విషయాన్ని హరికృష్ణకు తెలియనివ్వలేదు.

అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఇంకొక విషయం  ఏమిటంటే రామారావు గారు తన కుమారుల్లో ఎవరైనా సమర్థులు ఉంటే తన తరువాత చంద్రబాబు, వెంకటేశ్వరరావు , లక్ష్మీ పార్వతులు కాకుండా కుమారులకే అప్పజెప్పడానికి సుముఖంగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

సరిగ్గా ఇంచుమించు అదే సమయంలో గత ఎపిసోడ్ లో చెప్పిన విధంగా సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలు రావడం, జిల్లాల్లో అధికారిక అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. ఎనిమిది మంది మీద సస్పెన్షన్ వేటు పడటం, ఇంకా కొంత మంది ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయని ఈనాడులో రావడం జరిగింది.  ఇంత జరిగినప్పటికి  రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుండి దించే సాహసం చంద్రబాబు చేయగలుగుతాడా అనేది సందేహం . చంద్రబాబు అంత ధైర్యశాలి కాదు. అయితే ఎమ్మెల్యేలను సంప్రదించి సస్పెన్షన్ విషయం పై చర్చించడం మొదలుపెట్టాడు.

1995 ఆగస్ట్ 20  ప్రాంతంలో వైజాగ్ లో రామారావు గారు ప్రజల వద్దకు పాలన కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లారు. వారితో పాటు చంద్రబాబు కూడా అధికారికంగా అక్కడే ఉన్నారు. ఉదయం పూట రామారావుగారితో చంద్రబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, మిగతా సమయంలో ఎమ్మెల్యేలతో చర్చించటం మొదలుపెట్టారు. మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి , విద్యాధరరావు , ఇతరులు చంద్రబాబుకు సహాయపడ్డారు. ఇంటలిజెన్స్ ఈ ఉదంతాన్ని రామారావు గారికి చేర వేస్తున్నారు. రామారావు గారు మాత్రం మొదట పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.

ఇక్కడే  లక్ష్మీప్రసాద్ పాత్ర ప్రధానం . చంద్రబాబు దగ్గరకు వెళ్లి లక్ష్మీప్రసాద్ అన్నమాట ” మీరు పామును తట్టి లేపారు. బుసకొట్టిన పాము కాటు వేస్తుంది . అందుచేత మీరు పాము పడగను- కాటు వేయక ముందే పట్టుకొని నలిపివేయాలి” .  అంటే రామారావు గారు పాము అనుకుంటే  రామారావు గారిని దించే చర్యను  వెంటనే  ఉపక్రమించమని అప్పటికే ఎమ్మెల్యేలతో ముందే చర్చలు జరుగుతున్న సందర్భంలో పైకి చెప్పకపోయినా లోపల రామారావు గారిని దింపాలని ప్లాన్ వేసుకొనే కార్యక్రమం చేయాలి అని. దీనిని సాధించడం ఎలా అంటే మొదటి అస్త్రం  బాలకృష్ణ .

ఆగస్టు 24 న వైజాగ్ షూటింగ్ లో ఉన్న బాలకృష్ణను కన్వెంస్సు చేసి లక్ష్మీ ప్రసాద్ వెంటబెట్టుకొని హైదరాబాద్ తీసుకొని వచ్చారు.  అప్పటికే ఒకవైపు చంద్రబాబు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. లక్ష్మీ ప్రసాద్ బాలకృష్ణను నేరుగా సెక్రటేరియట్ లో చంద్రబాబు పేషీకి తీసుకొచ్చి కూర్చోపెట్టడం జరిగింది . అక్కడ నుండే హరికృష్ణకు కబురు చేసి రప్పించడం జరిగింది. మధ్యాహ్నం నాటికి ఎమ్మెల్యేలు రావటం మొదలయింది . వచ్చిన వారికి హరికృష్ణ,  బాలకృష్ణలను చూపిస్తూ కార్యక్రమం త్రీవ్రతరం చేయడం జరిగింది.

మొత్తానికి 60,70 మంది దాకా ఉండి, మిగతా వారిని ఫోన్ ద్వారా సంప్రదింపులు చేస్తూ పోయారు. ఇంతకీ హరికృష్ణ , బాలకృష్ణ లను ఏమి చెప్పి తీసుకొచ్చారని ప్రశ్నించుకుంటే తన తండ్రిని పదవీచ్యుతుడిని చేస్తున్నారని బహుశా చెప్పి ఉండకపోవచ్చు.  లక్ష్మీపార్వతిని నిలువరించడం వరకే పరిమితమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలు తర్వాత రోజుల్లో నేను బాలకృష్ణను అడిగగా ఇదే అభిప్రాయాన్ని నాకు చెప్పటం జరిగింది.

ఇక నా పాత్ర అంటారా…

సరిగ్గా ఈ సంఘటన జరుగుతున్న సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ఆగస్టు 19, 20 తేదీలు. ఆ రెండు మూడు రోజులు నా ఫోన్ మోగుతూనే బిజీగా ఉంది. దాదాపు 120 నుండి 150 మంది వరకు ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అప్పటికే చాలామందిని చంద్రబాబు వర్గం సంప్రదించిందని  చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల మాటలను బట్టి  వారు చంద్రబాబు వర్గంలోకి పోవాలని  భావిస్తున్నట్లు గా నాకు గోచరించింది. ఎమ్మెల్యేలు ఎందుకలా వ్యతిరేకమవ్వాలి అనుకుంటున్నారంటే  నాకు అనిపించింది 1994లో చంద్రబాబు దగ్గర రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఉండేవి. ఒకటి రెవెన్యూ, రెండవది ఫైనాన్స్. ఎమ్మెల్యేలకు చిన్నాచితకా లాభదాయకమైన పనులను చంద్రబాబు చేసి పెడుతూ ఉండేవాడు. రామారావు గారి వద్ద అవి సాధ్యపడేవి కావు . ఇక్కడ పరిస్థితి చూస్తే బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ అక్కడే ఉన్నారని ధైర్యం ఎమ్మెల్యేలకు కలిగింది.

may 24 ఉదయం  చంద్రబాబు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటానని మాత్రమే చెప్పాను. సాయంత్రం వచ్చే వరకూ కూడా నేను ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఎమ్మెల్యేల మొగ్గు వ్యతిరేక వర్గం వైపే కనబడుతుంది. ఇక అప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను. అంతిమంగా శాసనసభ్యుల నంబరే ముఖ్యమంత్రిని చేసేది. ఇంత మంది అనుకూలంగా ఉన్న వారితో నేను ఉంటేనే కదా తర్వాత నేను ఏమైనా చేయగలిగేది. గతంలో 1989 లో జరిగిన ఉదంతంతో నా పాత్ర  పైన నాకే విశ్వాసం ఉంది . ( 30 మంది మంత్రులను తీసివేసినప్పుడు నేను mla లను కట్టడి చేసి విజయం పొందానన్న విషయం ) ఎలాగైనా తర్వాత రోజుల్లో నేను మళ్లీ ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకు రావచ్చునని అనుకున్నాను. సాయంత్రం నేను హైదరాబాద్ రాగానే విమానాశ్రయానికి చాలా మంది ఎమ్మెల్యేలు పెద్దఎత్తున వచ్చారు. అందరూ నా ద్వారా పార్టీలో పదవులు పొందిన వారే .

అయితే విమానాశ్రయంలో సంప్రదింపుల నేపథ్యంలో నాకు అర్థమయ్యిందేమిటంటే అందరూ నన్ను కూడా తమతోపాటు వ్యతిరేక వర్గం వైపు నిర్ణయం తీసుకోమన్నట్లు గా ఉంది.  నేను నేరుగా బంజారాహిల్స్ లోని మా ఇంటికి వచ్చేసరికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు మా ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నేను ఒక గదిలోకి వెళ్ళాము. చంద్రబాబు చెప్పిన ప్రపోజల్ తను సీఎం అని, నేను డిప్యూటీ సిఎం అని, హరికృష్ణ పార్టీ జనరల్ సెక్రటరీ అని, అధ్యక్షుడు కూడా తానేనని చెప్పాడు. నేను ఎమ్మెల్యేలతోపాటు ఉండాలని ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి సరే అన్నాను. చంద్రబాబు వెళ్ళిపోగానే నేను రూం నుండి బయటకు వచ్చాను. లక్ష్మీప్రసాద్, విజయ ఎలక్ట్రికల్స్ రమేష్ , చలమేశ్వర్ గార్లు నన్ను చుట్టు ముట్టారు.

లోపల ఏమి జరిగిందని అడిగారు . నేను విషయం అంతా చెప్పాను. వెంటనే వారు హరికృష్ణ కూడా కేబినెట్లో ఉండాలన్నారు. వెంటనే నేను దానికి స్పందించి అలాగైతే హరికృష్ణ కే డిప్యూటీ సీఎం పదవిని అడగండి, నేను కేబినెట్ లోకి రాను మనలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండటానికి హరికృష్ణ ఉన్నా, నేను ఉన్నా ఒకటేనని చెప్పాను. అయితే నేను విరమించుకున్న విషయం చంద్రబాబుకు చెప్పవద్దు, చంద్రబాబు నన్ను అడిగినప్పుడు నేనే చెప్తానని చెప్పాను. వారు సంతృప్తి చెంది వెళ్ళి పోయారు. ఈ విషయం అప్పటికి చంద్రబాబుకి తెలియదు. అదే రోజు రాత్రి వైశ్రాయ్ హోటల్లో అందరము చేరాము.

చంద్రబాబును లీడర్‌గా ఎన్నుకొనే కార్యక్రమం ప్రపోజ్ చేయమని చంద్రబాబు నన్ను అడిగారు. ఇంకొకటి కూడా అడిగాడు  ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.  ముందు హరికృష్ణ, బాలకృష్ణలకు  రామారావు గారిని దించి చంద్రబాబును ఎన్నుకునే విషయం  గురించి నన్నే చెప్పమన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. మరి వారికి ఏమి చెబితే నీతో వచ్చారని అడిగాను. చంద్రబాబు దాటవేత ధోరణి అవలంబించారు.  ఎన్నిక ప్రక్రియ అయిన వెంటనే చంద్రబాబు రామోజీ రావు గారి ని కలవటానికి వెళ్లారు. 

ఆ సంప్రదింపుల్లో రామోజీరావు గారు చంద్రబాబుతో నీకు వెంకటేశ్వరరావుతో రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది ( గతంలో తనకు జరిగిన అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని). ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవద్దని రామోజీరావు సలహా ఇచ్చారు. అదే విషయాన్ని రెండోరోజు ఈనాడు  పత్రిక ఎడిటోరియల్ లో కూడా రాశారు. నేను ముందే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మిన్నకుండిపోయాను. అయితే చంద్రబాబు తాను నాయకుడిగా ఎన్నికైన మరు క్షణం నుండి నాతో సంప్రదింపులు మానేశాడు. కనీసం ప్రకాశం జిల్లాలో ఎవరు మంత్రిగా ఉండాలని కూడా సంప్రదించలేదు.

అంతకు ముందు నాకు చెప్పిన విషయం ….ఏ విషయంలోనూ నాతో సంప్రదించకుండా ఏ పని చేయన‌ని చెప్పిన వ్యక్తి. అంతటితో ఆగకుండా నాతో  ఎవ్వరూ కలవ నీయకుండా పూర్తిగా  నియంత్రణ చేయడం మొదలుపెట్టాడు. హరికృష్ణ కూడా మంత్రి పదవి దక్కిన తర్వాత నాతో సంప్రదింపులు ఆపేశాడు. ఇక్కడ రెండవ వైపు రామారావు గారి దగ్గర కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. పురంద‌రేశ్వరి గారి పాత్ర గురించి కథనాలు వచ్చాయి. ఆనాటి సంఘటన లో ఆమె నన్ను ప్రోత్సహించారని….ఇది ముమ్మాటికీ నూటికి నూరుపాళ్లు అవాస్తవం, కల్పితం.  ఎందుకంటే నేను వైస్రాయ్ హోటల్ కి వెళ్ళగానే పురంద‌రేశ్వరి వారి నాన్నగారి దగ్గరకు వెళ్ళింది. వాస్తవానికి నా చర్యలను నిలువరించింది. నన్ను వద్దని చెప్పింది. నేను మాట వినక పోయేసరికి మరుసటి రోజు ఉదయం ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళింది.

ఆవిడ నన్ను ప్రోత్సహించి ఉండినట్లైతే అలా వెళ్లగలిగేదేనా?  ఇక్కడ ఒక మాట చెప్పాలి… అప్పుడు రామారావు గారు పురందేశ్వరితో  అన్న మాటలు తలచుకు న్నప్పుడల్లా ఇప్పటికీ నాకు కడుపులో దేవినట్లు ఉంటుంది . “ఎప్పుడూ కలవని చంద్రబాబు వెంకటేశ్వరరావులు ఇద్దరూ  ఈ ముసలివాడిని దించేందుకు కలిసారా అమ్మ … చంద్రబాబు చేశాడు సరే వెంకటేశ్వరరావు అలా కాదు కదా ” ఆ మాటలు తలచుకుంటే ఈ రోజుకీ, ఈ రాసే సమయంలో కూడా కంట్లో తడి అవుతుంది.

ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. నా పరిస్థితి అక్కడ నన్ను ఒంటరిని చేశారు .  20 రోజులు కాకుండానే నేను తిరిగి రామారావు గారి వద్దకు చేరుకున్నాను. నేను ఎవ్వరినీ కోరక పోయినా నాతో పాటు 16 మంది శాసనసభ్యులు వచ్చారు . చివరి రోజుల్లో రామారావు గారి దగ్గర  ఉండే భాగ్యం నాకు కలిగింది. మళ్ళీ పార్టీ పని అప్పజెప్పారు. జనరల్ సెక్రటరీగా బాధ్యత అప్పజెప్పిగా  సింహగర్జన ఏర్పాట్లు జరుగుతున్న సమయం. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాము.  అంతలోనే ఆయన మరణం  సంభవించింది .

చివరిగా సారాంశం ఏమిటంటే లక్ష్మీప్రసాద్ ప్రమేయం లేకుంటే, బాలకృష్ణ హరికృష్ణ లు ఆ రోజు  అక్కడకు రాకుంటే  ఈ దుర్ఘటన సాధ్యమయ్యేది కాదు. చంద్రబాబు  ఫెయిల్ అయ్యేవారు. రామారావు గారు మానసిక ఒత్తిడికి గురి అయ్యేవారు కాదు. బ‌తికి ఉండేవారు.. ప్రధాని అయ్యేవారు.

ఇప్పుడు ఇది ఎందుకు రాస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఈ కోణపు కథనం నేను ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో రాయలేకపోయాను. ఆ నాటికి నాకు పూర్తిగా సమాచారం తెలియదు. లక్ష్మీ ప్రసాదు చంద్రబాబుతో మాట్లాడిన ఉదంతం , ఎన్టీ రామారావు గారు నెహ్రూ వచ్చినప్పుడు హరికృష్ణను సపోర్ట్ చేయమని చెప్పినటువంటి విషయం నాకు గతంలో తెలియదు. తరువాతి రోజుల్లో లక్ష్మీప్రసాద్ చెప్పడం వల్లే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. నాకే కాదు చాలామందికి ఆయనే చెప్పాడు. లక్ష్మీ ప్రసాద్ నాతో ఇప్పటికీ సఖ్య‌త‌తోనే ఉంటాడు. ఇలా వ్రాస్తున్నందుకు లక్మీ ప్రసాద్ అన్యధా భావించ వద్దని ప్రార్ధన.  ఈ నిజాలను బాధ్యతతో తెలియజేయటం నా కర్తవ్యమని తెలియజేస్తున్నాను.  

ఇక పోతే కొంతమంది ఈ రెండు రోజులు…  నేను అసూయ అక్కసుతోనే రాస్తున్నానని కూడా వ్యక్తపరిచారు. దానికి కొంత వివరణ

నా వయస్సు 68 సంవత్సరాలు. నేను జీవితంలో అన్నీ చూశాను.  సహజంగా 70 సంవత్సరాల తర్వాత జీవించిన ప్రతి సంవత్సరం బోనస్ కింద లెక్క వేసుకోవాలనేది నా అభిప్రాయం. పిన్న వయస్సులోనే  భగవంతుడు అన్నీ ఇచ్చాడు. పదవీ, అధికారం , మంచి కుటుంబం, జీవించడానికి సరిపడా ఏర్పాట్లు ఇచ్చాడు. నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం లో చాలా మంది ప్రధాన మంత్రులను,  ముఖ్యమంత్రులను చూశాను. దేశ, ప్రపంచ చరిత్రలను కూడా క్షుణ్ణంగా చదివాను.  ప్రస్తుతం కరోనా సమయంలో  పుస్తకం కూడా రాశాను. ప్రచురణకు సిద్ధంగా ఉంది. చరిత్రలో  మేసిడోనియా కింగ్ అలెగ్జాండర్ దగ్గర నుంచి.. జూలియస్ సీజర్.  ఫ్రాన్సు కింగ్ లూయిస్, ఇంగ్లాండ్  కింగ్  హెన్రీ లు… నెపోలియన్ , ఫ్రెంచ్ రెవల్యూషన్,  బోల్షివిక్ విప్లవం , రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్, ముస్సోలిన్, ఆ తర్వాత రోజుల్లో మావో ఇవన్నీ చదివిన వాడిని.

విషయం ఏమిటంటే చరిత్రలో ఎవరూ కూడా శాశ్వతం కాదు. కాకపోతే ఒక రోజు ముందు.. ఒకరోజు వెనక.. పోవలిసిందే. నా ఉద్దేశం….  జీవితంలో చివరి దశలో ప్రతిరోజు మనకు దేవుడు ఇచ్చిన వరం మే.  ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ,మరీ ఈ కరోనా సమయంలో.  వీలైనంత వరకు అది లేదు.. ఇది లేదు.. అనుకోకుండా ఉన్న  సమయాన్ని  సుఖంగా, సంతోషంగా గడపటం అనేది ముఖ్యమని నా అభిప్రాయం. ఎందుకంటే మళ్లీ ఈ మానవ జన్మ ఉంటుందో, లేదో తెలియదు. నా అభిప్రాయంలో జన్మ ఒక్కటే. దీనిని గ్రహించకుండా నాకు ఇంకా పదవులు కావాలి, పెత్తనం చేయాలి అనుకోవడం సమంజసం కాదని.. అందరూ  ముఖ్యమంత్రులు అవ్వాలంటే  సాధ్యమా ?

మొన్న ఎన్నికలలో నేను ఓడిపోయాను. అందుకు నేను సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా అనుకుంటే దేవుడు నన్ను ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవ చాలు… ఇక పై నీవు అనుభవించవలసిన ఇంకొక జీవితం ఉంది, భార్య పిల్లలు కుటుంబంతో కాలం గడపమని నాకు దేముడు చెప్పినట్లుగా గోచరిస్తుంది . గతంలో నేను నా పిల్లల గురించి పట్టించుకునే వాడిని కాదు. వారితో గడిపిన సమయం కూడా చాలా తక్కువ. చివరికి వారు ఏ క్లాసు చదువుతున్నారు కూడా నాకు తెలిసేది కాదు.

అయితే గత ఐదారు సంవత్సరాలుగా నేను ఇది తెలుసుకొని నా స్నేహితులతోటి కుటుంబం తోటి సమయం  గడుపుతున్నాను. ఈ కోవిద్ సమయంలో నా మనవళ్లు, మనవరాళ్లకు రామాయణం మహాభారతం, రామారావు గారి పౌరాణిక సినిమాలు చూపి స్తూ, వారితో చెస్ ఆడుతూ  కాలక్షేపం చేస్తూ ఉన్నాను. ఇదే నాకు దేవుడు చెప్పిన పని, నేను గతంలో కోల్పోయిన నాకు సంతోషకరమైన అటువంటి పని ఇది.. వీలైతే మీరు కూడా ఆలోచించండి.

ఇక ఇంతటితో ముగిస్తాను. (ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫేస్‌బుక్ నుంచి)