కరోనాను అరికట్టే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు దేశం యావత్తు జనతా కర్ఫ్యూను చిత్తశుద్ధితో పాటించి విజయవంతం చేసింది. అయితే ఆ మరుసటి రోజు నుంచి దేశ వ్యాప్తంగా గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. దీనిపై ప్రధాని మోడీ సైతం అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో జనం ఇళ్లకే పరిమితం అయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించాయి. అవసరమైతే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ కూడదని నిర్ణయించాయి. కరోనా వైరస్ నిరోధానికి మందులు లేకపోవడం, మరోవైపు అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణం కలిగిన నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి.
అయినా ప్రజలు బేఖాతరు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లేడీ అమితాబ్ విజయశాంతి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ప్రజలకు సున్నిత హెచ్చరిక కూడా చేశారామె. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలను, సూచనలను ప్రజలు తూచా తప్పక పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
విజయశాంతి ట్విటర్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకూ ఆమె ఏం చెప్పారంటే…
‘దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కరోజు కాదు వారం రోజులు ఇంట్లో ఉన్నా తప్పులేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చెబుతున్నది మనం సంక్షేమం కోసమని గ్రహించండి, పాటించండి, ఇతరులకు బోధించండి..’ అని విజయశాంతి పేర్కొన్నారు.
మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాల్సిందే కదా. ఎందుకంటే కరోనా గురించి ఎవరేం చెప్పినా మన ప్రాణాలను మనం కాపాడుకునేందుకే అని జనం గ్రహించాలి, గుర్తించాలి. తాజాగా విజయశాంతి చెప్పిన మాట విని ఇంటి నుంచి ఎవరూ బయటకు రారు కదా! ఏమంటారు ప్రజల్లారా?.