స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే…. పూర్తిగా పల్లె స్థాయిలో ఉండే సమస్యలు, వార్డు స్థాయిలో ఉండే చిన్న నాయకులు వ్యక్తిగత ప్రాబల్యం, గ్రామస్థాయి బలాబలాల మీద ఆధారపడి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా పార్టీల ప్రభావమే కొంత తక్కువగా ఉంటుంది. పార్టీ అభ్యర్థులే గెలిచినప్పటికీ…. వారి వ్యక్తిగత బలవిశేషాలే విజయానికి బాటలు వేస్తూ ఉంటాయి. ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీలు రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవడం కూడా కొంత అరుదు. అయితే, జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం స్థానిక ఎన్నికల కోసం హస్తినలో కూర్చుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చోప చర్చలు సాగిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పేరుకు భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారే గానీ, మనస్ఫూర్తిగా ఆ పార్టీతో కలిసి అడుగులు వేయడానికి ఇంకా తడబడుతూ ఉన్నట్లున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో మమేకమై పని చేయడానికి ఆయనకు ఇంకా అహంభావం అడ్డు వస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారికంగా పొత్తు గురించి ప్రకటించడానికి ఉద్దేశించిన సమావేశంలో తప్ప రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో జనసేన నాయకులు కలిసి సమావేశాలు నిర్వహించిన సందర్భాలు తక్కువ. ‘‘నాదంతా ఢిల్లీ స్థాయి’’ అని సంకేతాలు ఇవ్వడమే లక్ష్యం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తన పొత్తు రాజకీయాలను ఢిల్లీ నుంచి మాత్రమే నడుపుతున్నారు.
మరో కోణం నుంచి చూసినప్పుడు రాష్ట్ర భాజపా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ తో అంటీ ముట్టని వైఖరినే అవలంబిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూర్చుని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దేవధర్, జివిఎల్ నరసింహారావు లతో కలిసి చర్చలు సాగించారు. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించగల బలం లేదన్నది స్పష్టం. అంతో ఇంతో జనంలో ఉండే భారతీయ జనతాపార్టీ నాయకులు కేవలం వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రమే పాల్గొన్నారు. అసలు వాళ్ళు ఇక్కడ ఉండగా హస్తినలో పవన్ ఏ మంతనాలుసాగిస్తున్నారు ఇది ప్రశ్న. తాను వేస్తున్నవి తప్పుటడుగులు అని పవన్ త్వరలోనే అర్థం చేసుకుంటారు.