దీదీపై దాడి.. బెంగాల్ లో రాజకీయ వేడి

ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి అర్జీ ఇవ్వాలంటేనే.. సెక్యూరిటీ వాళ్లు లాగి అవతల పడేస్తుంటారు. అలాంటిది ఓ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి వారిని గాయపరిచేంత ధైర్యం చేశారంటే, ఆ సమయంలో పోలీసులు, సెక్యూరిటీ ఏమరుపాటుగా ఉన్నారంటే,…

ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి అర్జీ ఇవ్వాలంటేనే.. సెక్యూరిటీ వాళ్లు లాగి అవతల పడేస్తుంటారు. అలాంటిది ఓ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి వారిని గాయపరిచేంత ధైర్యం చేశారంటే, ఆ సమయంలో పోలీసులు, సెక్యూరిటీ ఏమరుపాటుగా ఉన్నారంటే, అసలా దాడి చేసిన వారు మళ్లీ కనిపించకుండా మాయం అయ్యారంటే ఇంకేమైనా ఉందా. సినిమాల్లో జరిగే ఇలాంటి లాజిక్ లేని సీన్లు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో జరిగాయి.

నందిగ్రామ్ లో నామినేషన్ వేసి తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. కారు డోరు తోసేయడంతో ఆమె కాలికి గాయమైంది. ఆ వెంటనే దీదీని టైట్ సెక్యూరిటీ మధ్య కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈ సమాచారమంతా స్వయంగా మమతానే మీడియాకు చెప్పడం, సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం.

దెబ్బ తగిలిన మమత, తన కాలు పట్టుకుని అల్లాడిపోతూ కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనపై దాడి జరగడానికి బీజేపీయే కారణం అని, పశ్చిమ బెంగాల్ డీజీపీని మార్చిన మరుసటి రోజే తనపై దాడి జరిగిందని, దీని వెనక కుట్ర ఉందని మమత ఆరోపిస్తున్నారు.

అయితే కుట్ర కంటే ఎక్కువగా పెద్ద డ్రామాని రక్తి కట్టించారని బీజేపీ నేతలు విమర్శలు ఎక్కు పెట్టారు. ముఖ్యమంత్రిపై దాడి చేయడం ఎవరికి సాధ్యమని, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ మమత సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నందిగ్రామ్ లో ఓటమి తప్పదని నామినేషన్ రోజే మమతకు అర్థమైందని అందుకే ఆమె పోతూపోతూ ఇలా సింపతీ డ్రామా మొదలు పెట్టారని అంటున్నారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్ని అటు దీదీ, ఇటు షా-మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయనే ఆశలో ఉన్న బీజేపీ.. బెంగాల్ పై బాగా ఫోకస్ పెట్టింది. అమిత్ షా ఇప్పటికా పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లారు, ఇటీవలే మోదీ కూడా కోల్ కతాకు వచ్చి సై అన్నారు. టీఎంసీని బలహీన పరిచేందుకు వలసలకు గేట్లెత్తేశారు. ఈ పాటికే కీలక నేతలందర్నీ తమవైపు తిప్పుకున్నారు.

ఇలా వ్యూహాత్మకంగా వెళ్తున్న బీజేపీకి.. ఇప్పుడు దాడి వ్యవహారంతో బ్రేక్ వేయాలని చూస్తున్నారు మమతా బెనర్జీ. బీజేపీ రౌడీ రాజకీయాలను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మద్రాసులో పుట్టగొడుగులు పండించి మొత్తం నష్టపోయా..

ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్