మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి అనుచితంగా వ్యవహరించిన తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి గలాభా చేయడం, అక్కడ ఏజెంట్లతో వాగ్వాదానికి దిగడంతో కొల్లును పోలీసులు అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ అక్కడే బైఠాయించే ప్రయత్నం చేశారు కొల్లు రవీంద్ర.
అయినా పోలింగ్ స్టేషన్లోకి వెళ్లడం ఏమిటో, వెళ్లిన వ్యక్తి చూసి వచ్చేయకుండా.. అక్కడ రచ్చ చేసి, బైఠాయించడం ఏమిటో మరి! పోలింగ్ స్టేషన్లో తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కొల్లు చెప్పడమే కామెడీ. పోలింగ్ స్టేషన్లోకి దూరి గలాభా చేస్తే.. అక్కడ నుంచి వెళ్లమని మొదట మర్యాదగా చెప్పడం, వినకపోతే తోసేయడంలో వింత ఏమీ లేదు.
పోలింగ్ స్టేషన్లో తనకు హారతి కర్పూరాలు ఇవ్వాలన్నట్టుగా కొల్లు మాట్లాడారు. ఆపై అక్కడే బైఠాయింపట, ఓటర్లు ఓటేయాలా? లేక ఈ డ్రామాలను చూసి వెనక్కు వెళ్లాలా?
ఈ నేపథ్యంలో కొల్లుపై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ కు అంతరాయం కలిగించడం అంటే మాటలేమీ కాదని చెప్పనక్కర్లేదు. దీంతో గురువారం ఉదయం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆ స్పందన పరమ రొటీన్ ఉంది, పాచిపట్టిపోయిన డైలాగులనే చంద్రబాబు నాయుడు సంధించారు. బీసీలంటే జగన్ కు ద్వేషమని, అందుకే కొల్లును అరెస్టు చేశారనే తనదైన వాదనను చంద్రబాబు వినిపించారు.
బీసీలు పండగ జరుపుకోవడం జగన్ కు ఇష్టం లేదని కూడా చంద్రబాబు తేల్చేశారు! అంటే పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి రచ్చ చేసిన తెలుగుదేశం నేత బీసీ కాబట్టి.. కేసులు పెట్టకూడదు, కొల్లు రవీంద్ర అనుచితంగా ప్రవర్తించి అరెస్టు అయ్యారు కాబట్టి.. రాష్ట్రంలో బీసీలు ఎవ్వరూ మహాశివరాత్రి జరుపుకోవడం లేదు… ఇదీ చంద్రబాబు భాష్యం! ఇలా చెప్పీ చెప్పే.. తెలుగుదేశం గతి అలా తయారవుతున్నట్టుగా ఉంది.