వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. అది కుప్పం నుంచినే చేస్తారా? అనేది కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ. గత సార్వత్రిక ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడుకు కుప్పంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తను ముఖ్యమంత్రి హోదాలో, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కుప్పం నుంచి పోటీ చేసి.. గెలిచినా, మెజారిటీని మాత్రం చాలా కోల్పోయారు చంద్రబాబు నాయుడు.
కుప్పంలో చంద్రబాబు నాయుడు పట్టు జారిపోయిన వైనం అప్పుడే స్పష్టం అయ్యింది. చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రధాని పదవిని టార్గెట్ గా చేసుకున్నంత లెవల్లో ఎన్నికలకు వెళితే ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం గగనం అయ్యిందప్పుడు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశం చిత్తు కావడంతో.. చంద్రబాబు నాయుడు ఖంగుతున్నారు. కుప్పంలో కూసాలు కదిలిపోయాని ఆయనకు కూడా అర్థం అయ్యింది. కుప్పంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పక్షంగా జరగలేదంటూ ఆయన వాదించినా అది డొల్ల వాదనే అని స్పష్టం అవుతోంది. ఎవరో ఎస్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాడు, మరో సీఐ వేధించాడు, ఇంకో కానిస్టేబుల్ సహకరించలేదు.. అంటూ కుప్పంలో ఓటమికి చంద్రబాబునాయుడు సాకులు చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ అత్యంత వీక్ గా ఉన్న నియోకవర్గంలో ఓటమికి సాకులు చెప్పే వారు చెప్పే మాటలను స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారు! కుప్పంలో టీడీపీ స్థాయి ఏమిటో ఆయనే బయటపెట్టుకున్నారు. ఒక ఎస్ఐ, మరో సీఐ సహకరించకపోతే చాలు.. టీడీపీ అక్కడ కుప్పకూలిపోతుందని చంద్రబాబు నాయుడే ఒప్పుకున్నట్టుగా అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికలప్పుడే కుప్పంలో టీడీపీ అంత వీక్ అయినప్పుడు, ఇప్పుడు ఆ పార్టీ కూసాలు అక్కడ పూర్తిగా కదిలిపోవడంలో పెద్ద వింత లేదు. చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అవుతారేమో, ఉద్ధరిస్తారేమో అనే లెక్కలున్నప్పుడు, ఆ స్థాయిలో ప్రొజెక్షన్ జరిగినప్పుడే ఆయన మెజారిటీ ఆవిరయ్యింది.
అలాంటిది వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ చేతిలో అధికారం ఉండదు, చంద్రబాబు నాయుడు రాజకీయ భవితవ్యం ఏమిటో కుప్పం జనాలకు కూడా క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు ఆయనను మరోసారి వారు ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకుంటారు? అనేది సహజంగానే వచ్చే సందేహం.
తనకు కుప్పం జనాలు ఏదో రుణపడి ఉన్నట్టుగా అక్కడ తన పీఏలతో రాజకీయం చేయిస్తూ చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తే.. జనాలు ఏమీ అమాయకులు కాదు, చంద్రబాబుకు బానిసలూ కాదు. ఆయన కనీసం ఎమ్మెల్యేగా నెగ్గాలన్నా.. అది ప్రజల దయ ఉంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఎక్కడో హైదరాబాద్ లో తలదాచుకునే చంద్రబాబు కన్నా, స్థానికంగా అందుబాటులో ఉండే అభ్యర్థే తమకు మేలనుకుంటే కుప్పంలో కూడా చంద్రబాబునాయుడి కథ ఖేల్ ఖతం అవుతుంది.
విశేషం ఏమిటంటే.. స్వయంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంలో కథను క్లైమాక్స్ కు తీసుకొచ్చారు. అదెలాగంటే.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ చిత్తు అయ్యాకా ఆయన అక్కడకు వెళ్లారు.స్థానిక ఎన్నికల అభ్యర్థులను పక్కన పెట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పరువు పోయిన నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి స్వయంగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఇలా వార్డు మెంబర్ల విజయం కోసం ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇలాంటి నేపథ్యంలో కుప్పం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది కథకు క్లైమాక్స్ గా మారింది. పంచాయతీ ఎన్నికల ముందు కుప్పాన్ని ఆయన పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఝలక్ తో కుప్పం వీధుల్లోకి దిగొచ్చారు. మరి రేపు స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీలో కానీ, ఆ నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీ- జడ్పీటీసీ ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు కుప్పానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని మాత్రం స్పష్టం అవుతోంది.
పంచాయతీల్లోనే ఖేల్ ఖతం అయ్యింది. ఇక మిగతా స్థానిక ఎన్నికల్లో కూడా అదే జరిగితే.. నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు కూడా మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి ఫలితాలే వస్తే.. ఇక కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు సెలవు తీసుకున్నట్టే అని అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.