లోక్సభతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో అధికారం ఎవరిదనే విషయమై రకరకాల సర్వేలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతోంది. మెజార్టీ సర్వేల ఫలితాలు మాత్రం... మరోసారి జగన్దే అధికారం అని చెబుతున్నాయి. ఇలాంటి సర్వేలపై సహజంగానే టీడీపీ అనుకూల మీడియా తీవ్ర విమర్శలు చేస్తోంది. సర్వేల వెనుక ఏవేవో లింక్లు అంటగట్టడాన్ని చూస్తున్నాం.
ఇవన్నీ పక్కన పెడితే, ఏపీ ఇంటెలిజెన్స్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఓ నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైసీపీకి 110 నుంచి 115 సీట్ల వరకూ వస్తాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన సీట్లు కూటమికి వస్తాయని ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశం.
అయితే ఈ నివేదికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకీభవించలేదని తెలిసింది. జగన్ మాత్రం 130 సీట్ల వరకూ వస్తాయని ఇంటెలిజెన్స్ అధికారులతో అన్నట్టు సమాచారం. వైసీపీ వై నాట్ 175 నినాదంతో కొన్ని నెలలుగా జనంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని ఉత్సాహపరచడంతో పాటు ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడేందుకే ఈ నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళుతున్నారు.
వైసీపీకి వచ్చే సీట్లపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో జగన్కు విభేదాలున్నా, అధికారం మాత్రం ఖాయమనే ధీమా కనిపిస్తోంది. మరోవైపు కూటమి మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఇటీవల కాలంలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు